2016లోనే హెచ్చరించిన ఆర్బీఐ, పట్టించుకోని బ్యాంకులు, ఫలితమే పీఎన్బీ స్కాం!
ముంబై: స్విఫ్ట్ సిస్టమ్.. బ్యాంకుల మధ్య పరస్పరం సమాచారం పంపుకునే విధానం. ఇప్పుడు ఈ స్విఫ్ట్ సిస్టమే పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కాంకు కారణభూతమైంది. ఈ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారానే ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రూ.11,400 కోట్ల స్కాంకు పాల్పడ్డారు.
అయితే ఈ స్విఫ్ట్ సిస్టమ్ విషయంలో బ్యాంకు అధికారులు ఎందుకంత నిర్లక్ష్యంగా వహించారో వారికే తెలియాలి. నిజానికి పీఎన్బీ స్కాం వెలుగులోకి రావడానికి రెండేళ్ల క్రితమే అంటే 2016లోనే.. ఈ స్విఫ్ట్ ఇంటర్బ్యాంకు నెట్వర్క్లో లోపాలున్నాయని, వాటిని దుర్వినియోగ పరుస్తున్నట్లుగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులకు హెచ్చరించింది.
రిజర్వ్ బ్యాంక్ ముందస్తు హెచ్చరిక...
స్విఫ్ట్ ఇంటర్బ్యాంక్ నెట్వర్క్ ద్వారా నిధులను అనధికారికంగా బదిలీ చేస్తున్నారని రిజర్వ్ బ్యాంకు 2016 ఆగస్టులోనే దేశంలోని అన్ని బ్యాంకులకు ఒక సర్క్యూలర్ జారీ చేసింది. బ్యాంకులు సైబర్ సెక్యురిటీ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసుకోవాలని అందులో సూచించింది. స్విఫ్ట్ విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేసుకోమని సలహా ఇచ్చింది.
పలు సూచనలు చేసిన ఆర్బీఐ...
కరెస్పాండెంట్ బ్యాంకులకు పంపించే పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్స్ను బలోపేతం చేయాలని కూడా ఆర్బీఐ పేర్కొంది. హానికరమైన సాఫ్ట్వేర్ స్క్రిప్ట్/కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయో గుర్తించడం కోసం స్విఫ్ట్ ఇన్ఫ్రాక్ట్రక్చర్ను వెంటనే సమగ్రంగా ఆడిట్ చేయాలని, ఏమైనా లోపాలను గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా తన సర్క్యూలర్లో తెలిపింది.
పట్టించుకోని బ్యాంకులు...
అయితే రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలను దేశంలోని పలు బ్యాంకులు పెడచెవిన పెట్టాయి. ఈ నిర్లక్ష్యానికి ప్రతిఫలమే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబై బ్రాంచిలో జరిగిన రూ.11,400 కోట్ల కుంభకోణం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, పీఎన్బీ ముంబై బ్రాంచ్లోని ఇద్దరు బ్యాంకు అధికారులు కలిసి నకిలీ లెటర్స్ ఆప్ అండర్స్టాండింగ్ సహాయంతో విదేశీ బ్యాంకుల నుంచి రుణం పొందారు. ఈ ఎల్ఓయూలను పంపించడం, తెరవడం, మార్పులు చేయడం వంటి పనులన్నీ ఈ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారానే జరుగుతాయి.
నీరవ్ మోడీకి ఇదే కలిసొచ్చింది...
ఈ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా సందేశం అందినప్పుడు.. విదేశీ బ్యాంకు దీనిని అధికారికమైన, కచ్చితమైన సందేశంగా భావిస్తుంది. ఏమాత్రం అనుమానించదు. అందుకే తెలివిగా ఈ స్విఫ్ట్ సిస్టమ్ను ఉపయోగించుకుని, నకిలీ ఎల్ఓయూలతో నీరవ్మోడీ ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. పైగా పీఎన్బీ స్విఫ్ట్ సిస్టమ్, కోర్ బ్యాంకింగ్లో లింక్ అయి లేదు. దీంతో 2011 నుంచీ ఈ స్కాం జరుగుతున్నా గుర్తించడం చలా కష్టతరమైంది.