అశోక్ గజపతి రాజుకు 7 యూనియన్ల హెచ్చరిక!
ఎయిర్ ఇండియాను ప్రయివేటీకరణ చేయాలన్న నీతి అయోగ్ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయంపై తాము పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని ఎయిర్ ఇండియాకు చెందిన ఏడు యూనియన్లు కేంద్రాన్ని హెచ్చరించాయి.
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాను ప్రయివేటీకరణ చేయాలన్న నీతి అయోగ్ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయంపై తాము పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని ఎయిర్ ఇండియాకు చెందిన ఏడు యూనియన్లు కేంద్రాన్ని హెచ్చరించాయి.
జూన్ 14వ తేదీన కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు అపాయింటుమెంట్ కోరుతూ లేఖ రాశాయి. ప్రైవేటీకరణ అంశంపై చర్చించేందుకు అపాయింటుమెంట్ ఇవ్వాలని కోరాయి.
ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వారు ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి అయోగ్ రికమండేషన్ను పరిగణలోకి తీసుకోవద్దని, అలాగే ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఆందోళన చేసే పరిస్థితికి తీసుకు రావొద్దని వారు లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగాలు కూడా కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటీరణపై దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియాలో, అనుబంధ సంస్థల్లో మొత్తం 21,137 ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ లేఖను ఏఐ ఎయిర్ కార్పోరేటర్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజినీర్స్ అసోసియేషన్, యునైటెడ్ ఎయిర్ ఇండియా ఆపీసర్స్ అసోసియేషన్, ఏఐ ఇంజినీర్స్ అసోసియేషన్, ఏఐ కేబిన్ క్రూ అసోసియేషన్, ఏఐ సర్వీస్ ఇంజినీర్స్ అసోసియేషన్లు రాశాయి.
64 ఏళ్లలో ఇంతగా ఎదిగిన ఎయిర్ ఇండియా నీతి అయోగ్ నిర్ణయం వల్ల 15 రోజుల్లో నాశనమవుతుందని పేర్కొన్నారు.
మార్కెట్ షేర్లో 14 శాతమే ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేయడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా పడిపోవడానికి ప్రభుత్వమే కారణమని వారు పేర్కొన్నారు.
కాగా, సరైన పెట్టుబడిదారు దొరికితే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నుంచి పూర్తిగా వైదొలిగేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఆర్థిక, రక్షణ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత నెల తెలిపారు.
ప్రస్తుతం విమానయాన మార్కెట్లో 84 శాతం ప్రైవేట్ రంగం చేతుల్లోనే ఉన్నప్పుడు వాటా 100 శాతానికి పెరుగకూడదనడానికి ఎలాంటి కారణాల్లేవు అని అన్నారు. దేశీయ విమాన రంగంలో ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా చాలా తక్కువ. కానీ సంస్థపై అప్పులభారం రూ.50 వేల కోట్ల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం గతేడాది చివరినాటికి ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా 14.1 శాతానికి తగ్గి దేశంలోని అతిపెద్ద విమాన సంస్థల జాబితాలో మూడో స్థానానికి పరిమితమైంది.