నా తల్లి భారత్ సహనశీలి: మోడీకి అమీర్ సూచన
న్యూఢిల్లీ: భారతదేశం ఎంతో మతసహనదేశమనీ, కొందరి కారణంగా విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయనీ.. ఇలాంటి చర్యలకు ప్రధాని నరేంద్ర మోడీ కళ్లెం వేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ విజ్ఞప్తి చేశారు.
‘నా మాతృదేశం నాకు తల్లిలాంటిది. ఈ నేలను నేను ఎప్పుడూ ఒక బ్రాండ్లా చూడలేదు. ఒకవేళ ప్రభుత్వం నన్ను బ్రాండ్ అంబాసిడర్గా తొలగించినా సేవలు కొనసాగిస్తాను' అని పేర్కొన్నారు.
‘మన దేశం చాలా సహనశీలమైంది. కానీ, కొందరు వ్యక్తులు ఇతరులపై అనవసరంగా ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు అన్ని మతాల్లో ఉన్నారు. ప్రధాని మోడీ మాత్రమే ఇలాంటి కుయుక్తులను ఆపగలరు' అంటూ ‘ఆప్ కీ అదాలత్' అనే టీవీ కార్యక్రమంలో తన అభిప్రాయాలు వెల్లడించారు అమీర్.

పెరిగిపోతున్న మత అసహనం కారణంగా తన భార్య దేశం విడిచివెళ్లాలనుకుంటోందనీ ఆమీర్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చుకుంటూ ‘జనం ఒత్తిడిలో ఉన్నారు. చాలాచోట్ల నైరాశ్యం అలుముకుంది. కొంతమంది అభద్రతాభావానికి గురవుతున్నారు. అసహనం పెరిగిపోతోంది అని మాత్రమే చెప్పాను. నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు' అని అన్నారు.
‘నా వ్యాఖ్యలను అప్పట్లో తప్పుగా ప్రచురించారు. భారత అసహన దేశమని ఎప్పుడూ అన్లేదు. దేశంలో అసహనం ఉత్పన్నమవుతోంది.. అసహన దేశం అనే ఈ రెండు వాక్యాలు పరస్పర విరుద్ధమైనవి'అని అన్నారు. అసహన పరిస్థితులతో దేశాన్ని వీడాలనిపిస్తోందన్న భార్య కిరణ్ వ్యాఖ్యల్ని గుర్తుచేయగా... ‘ఆమె ఎక్కడికీ వెళ్లదు. ఈ దేశంలోనే పుట్టింది. తుదిశ్వాస వరకు ఇక్కడే ఉంటుంది' అని అన్నారు.












Click it and Unblock the Notifications