వీడియో వైరల్: పౌరసత్వ చట్టంపై వ్యతిరేకమెందుకంటూ స్టూడెంట్స్పై ఏబీవీపీ దాడులు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉన్నప్పటికీ బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నాయకులు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడి చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో దాడి చేస్తూ విద్యార్థులను బెదరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Citizenship Amendment Act:జెనీవాలో పౌరసత్వ సవరణ చట్టంను సమర్థించిన భారత్
నిరసనకారులపై ఏబీవీపీ విద్యార్థులు దాడులు
ఢిల్లీ యూనివర్శిటీలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై ఏబీవీపీ నాయకులు దాడి చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1:27 నిమిషాల విడిది ఉన్న ఈ వీడియోలో శాదర జిల్లాకు చెందిన ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జితేందర్ చౌదరి కేరళకు చెందిన విద్యార్థిపై దాడి చేశారు. పౌరసత్వ సవరణ చట్టంను సమర్థిస్తావా లేదా అంటూ బెదిరించారు. దీనికి విద్యార్థి సమర్థించను అని చెప్పడంతో వీడియోలో కనిపించని మరో వ్యక్తి కేరళ విద్యార్థిని పక్కకు తీసుకెళ్లు అంటూ పురమాయించడం వీడియోలో వినిపిస్తుంది.
విద్యార్థిపై ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దాడి
మరో 10 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ఏబీవీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ భరత్ శర్మ పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్న ఓ విద్యార్థిపై దాడి చేస్తున్న విజువల్స్ కనిపించాయి. పొలిటికల్ సైన్స్ విభాగంకు చెందిన విద్యార్థిపై భరత్ శర్మ దాడి చేస్తున్న వీడియోస్ బయటపడ్డాయి. ఆ వీడియోలో ఉన్నది తానే అని ఒప్పుకున్న భరత్ శర్మ... లెఫ్ట్ భావజాలాలు ఉన్న విద్యార్థులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నందునే దాడి చేశామని చెప్పాడు.
విద్యార్థులపై దాడి చేసిన ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ అధ్యక్షుడు
మరో 20 సెకన్ల వీడియోలో ఇంకో విద్యార్థిపై ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి అధ్యక్షుడు అక్షిత్ దహియా దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. నిరసన తెలుపుతున్న విద్యార్థి ఐడీ కార్డును అడిగి ఆ తర్వాత అతనిపై దాడి చేశారు. అయితే తనపై దాడి చేసేందుకు రాగా నిలువరించేందుకు ప్రయత్నించానని దహియా చెప్పాడు. నిరసన తెలుపుతున్న విద్యార్థిపై దాడి చేస్తుండగా తాను అడ్డుకోబోయానని అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగిద్దామని అనుకున్నట్లు అక్షిత్ దహియా చెప్పాడు.