టెర్రరిస్టు కొడుక్కి ఎ1 గ్రేడ్: కాశ్మీర్ లోయలో జోష్
శ్రీనగర్: టెర్రరిస్టు అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురు చదువులో తన ప్రతిభను ప్రదర్శించారు. జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో గాలిబ్ గురు 95 శాతం మార్కులు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.
అతను 500 మార్కులకు గానూ 474 మార్కులు సాధించాడు. ఐదు సబ్జెక్టులలోనూ ఏ1 గ్రేడ్ సాధించాడు. జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో గాలిబ్ గురు విద్యను అభ్యసిస్తున్నాడు.
భారత పార్లమెంట్పై దాడి చేసిన ఘటనలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు 2013 ఫిబ్రవరి 9న ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కష్టాలకు ఎదురీది మంచి మార్కులు సాధించిన గురుపై సోషల్ మీడియాలో వేర్పాటువాదులు ప్రశంసలు కురిపించారు.
ట్విట్టర్లో, ఫేస్బుక్లో గాలిబ్ గురుపై ప్రశంసల వర్షం కురిసింది. అతనికి శుభాకాంక్షలు, భగవంతుడు అతన్ని అతని తండ్రిని ఆశీర్వదించు గాక, అల్లా అతనికి జన్నత్ ఉల్ ఫిర్దౌసీ ఇచ్చు గాక అంటూ సోషల్ మీడియాలో ఒకతను వ్యాఖ్యానించాడు. తండ్రి గర్వించే విధంగా చేశాడని మరొకతను అన్నాడు.
అఫ్జల్ కుమారుడు వేర్పాటు వాదులను తిరస్కరించాడని, ఆ బాలుడి నుంచి ఇతరులు పాఠాలు నేర్చుకుంటారని అశీస్తున్నానని ఓ కాశ్మీరీ పండితుడు వ్యాఖ్యానించాడు.