హజ్ 2021: దరఖాస్తులన్నింటినీ రద్దు చేసిన భారత హజ్ కమిటీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియా ప్రభుత్వం విదేశీయులకు అనుమతించలేదు. 60వేల మంది స్థానికులకు మాత్రమే అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం హజ్ యాత్ర రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం హజ్ యాత్రకు చేసుకున్న దరఖాస్తులన్నింటినీ రద్దు చేసినట్లు భారత్ హజ్ కమిటీ మంగళవారం ప్రకటించింది.
కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా సౌదీ అరేబియాలోని స్థానిక పౌరులు, నివాసితులకు మాత్రమే హజ్కు హాజరుకావడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని హజ్ కమిటీ తన సర్క్యూలర్లో వెల్లడించింది. స్థానికులకు, అది కూడా పరిమిత సంఖ్యలోనే హజ్కు అనుమతిస్తున్నట్లు ప్రకటించిందని తెలిపింది.
ఈ కారణంగానే హజ్ 2021 స్టాండ్ల కోసం అన్ని దరఖాస్తులు రద్దు చేయాలని భారత హజ్ కమిటీ నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యాత్రికులను పంపవద్దని సౌదీ కోరిన క్రమంలో గత సంవవత్సరం(2020) కూడా భారత్ నుంచి హజ్కు ఎవరూ వెళ్లలేదు. ఈ సంవత్సరం కూడా సౌదీ విదేశీయులకు అనుమతివ్వకపోవడంతో వరుసగా రెండో ఏడాది కూడా భారతీయులకు హజ్ యాత్ర వెళ్లే అవకాశం దక్కలేదు.
ప్రపంచంలోని ముస్లింలంతా పరమ పవిత్రంగా భావించే యాత్ర హజ్. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని కోరుకుంటారు. కరోనాకు ముందు ప్రతి సంవత్సరం భారత్ నుంచి వేలాది మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లేవారు. అయితే, కరోనా వచ్చిన నాటి నుంచి సౌదీ విదేశీయులకు అనుమతివ్వడం లేదు. దీంతో సౌదీలోని స్థానికులు మాత్రమే హజ్ యాత్రకు వెళుతున్నారు.