అఖిలేశ్ యాదవ్కు మరో షాక్ .. బీజేపీలోకి మామ ప్రమోద్ కుమార్ గుప్తా
సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఇంటిపోరు తప్పడం లేదు. మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడలు అపర్ణ యాదవ్ ఎస్పీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరారు. ఈ షాక్ నుంచి తెరుకోక ముందే ఎస్పీకి మరో షాక్ తగిలింది. తాజాగా అఖిలేశ్ యాదవ్ మామ , మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ గుప్తా కమలం కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ములాంయం సింగ్ కుటుంబం సభ్యులు వరుసగా బీజేపీ గూటికి క్యూకట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
.ఎస్పీలో గౌరవం లేదు..
సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలను అఖిలేశ్ యాదవ్ ఎప్పుడో కాలరాశారని ప్రమోద్ కుమార్ గుప్తా విమర్శించారు. పార్టీలో ఎవరికీ గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్తోపాటు శివపాల్ యాదవ్లకు పార్టీ ఏమాత్రం గౌరవం లేదన్నారు. అందుకే బీజేపీలో చేరిపోతున్నట్లు ప్రమోద్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఎస్పీ నుంచి బీజేపీలోకి ఇంకా వలసలు ఉంటాయని పేర్కొన్నారు.
ములాయం సింగ్ యాదవ్కు వేధింపులు
సమాజ్ వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్, శివలాల్ యాదవ్లు తీవ్ర ఇబ్బందులు , వేధింపులకు గురవుతున్నారని ప్రమోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. జూదగాళ్లకు, రౌడీలకు, భూకబ్జాదారులకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ములాయం సింగ్ యాదవ్ను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని , ఆయనతో ఎవ్వర్నీ కలవకుండా చేస్తున్నారని పరోక్షంగా అఖిలేశ్ యాదవ్పై విరుచుపడ్డారు. ములాయం సింగ్ యాదవ్ ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కనీసం ఆయన పుట్టిన రోజైనా మాట్లాడనీయకుండా మైక్ లాగేసుకున్నారని గుప్తా ఆరోపణలు గుప్పించారు.
రెండు మూడు రోజుల్లో బీజేపీ గూటికి..
మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ గుప్తా ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తాకు భావ. ఆయన ములాయంకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిలో ఒకరు. అయితే 2007లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రమోద్ కుమార్కు పార్టీ టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలుపొందారు. అప్పుడు ఆయన సత్తా ఎంటో సమాజ్ వాదీ పార్టీకి తెలిసొచ్చింది. 2012లో బిధునా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగి.. ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు శివపాల్ యాదవ్ నేతృత్వంలోని ప్రగతిశీల సమాబ్ వాదీ పార్టీలో కార్యవర్గ సభ్యులుగా ఆయన కొనసాగారు. తాజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రమోద్ కుమార్ గుప్తా ప్రకటించారు.