టీవీ చానెళ్లపై బ్యాన్: కెసిఆర్కు మంత్రి జవదేకర్ లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు లేఖ రాశారు.తెలంగాణలో ఏబీఎన్, టీవీ-9 ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడంపై కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై గతంలో టీ. సీఎస్కు లేఖ రాశామని ఆయన అన్నారు.
ఎంఎస్వోలు ఛానళ్లను నిలిపివేయడం సరైన చర్యకాదని, భావప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుందని జవదేకర్ అన్నారు. కాబట్టి రెండు చానళ్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్కు లేఖ రాశానని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, భారత రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను అందరికీ ప్రసాదించిందని, అలాంటి రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 తదితర రాజ్యాంగానికి సంబంధించిన ఉల్లంఘనలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని, ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని జవదేకర్ ఆ లేఖలో అన్నారు.
ప్రసారాలను నిలిపివేసే హక్కు ఎంఎస్వోలకు లేదని, ఛాణళ్లను సెన్సార్ చేసే అధికారం వాళ్లకు లేదని, అలాంటిది ఎంఎస్వోలు ఇంతకాలంగా ( జూన్ 16 నుంచి ) ఛానళ్లను నిలిపివేసినా, తాను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినా చర్యలు తీసుకోకపోవడం సమంజసం కాదని, తక్షణమే ఛానళ్లు ప్రసారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్కు రాసిన లేఖలో జవదేకర్ వివరించారు.