ఝలక్: 'ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాలపై బీజేపీ పావులు!'
హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంపై అధిష్టానం దృష్టి సారించిందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు బుధవారం చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాల ఆధారంగా కాకుండా, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ద్వారా పట్టు సాధిస్తామన్నారు.
అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు.
సంస్థాగతంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజల్లో పట్టు సాధిస్తామన్నరాు. అందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్ని రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారన్నారు. ఈ నెల 20న తమిళనాడు, తెలంగాణలో జనవరి 16న అమిత్షా పర్యటిస్తారన్నారు.
ఒక్కో రాష్ట్రంలో కనీసం ఒకరోజు చొప్పున ప్రతినెలా పర్యటించాలని అమిత్ షా భావిస్తున్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున కొత్త ఓటర్లు ఓట్లు వేశారని, 2009లో ఎనిమిది కోట్ల మంది ఓట్లు వేయగా, 2014లో 17 కోట్ల మంది ఓట్లు వేశారన్నారు.
ఎక్కువగా యువకులు బీజేపీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. అన్ని వర్గాలను, ప్రధానంగా నిమ్న వర్గాలను పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. పార్టీ సభ్యత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరక జరుగుతుందని, చాలా సమయం ఉందని మురళీధర రావు తెలిపారు.
కాగా, మోడీ సర్కారు పలు అంశాలపై యూ టర్న్ తీసుకుందన్న కాంగ్రెస్ పైన మురళీధర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విమర్శించే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నోసార్లు టర్న్స్ తీసుకుందన్నారు. కాంగ్రెస్ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోను ఫెయిల్ అవుతోందన్నారు. తాము ప్రతి అంశాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్తున్నామని చెప్పారు.
షాకిచ్చిన ప్రధాని
పార్లమెంటు సమావేశాలకు ఆలస్యంగా వచ్చిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ఇచ్చారు. పార్లమెంటు ఆవరణలో మంగళవారం జరిగి బిజెపి పార్లమెంటు సభ్యుల సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారికి తలుపులు మూసేశారు. సమయానికి సమావేశానికి రావాలని ఆయన పార్లమెంటు సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యంగా వచ్చినవారికి అనుమతి నిరాకరిస్తూ తలుపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
మంగళవారం పార్లమెంట్ ప్రాంగణంలోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఈ అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశానికి ఏకంగా 20 మంది ఎంపీలు ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చిన వారికి హాలులోకి వచ్చేందుకు ప్రవేశం కల్పించవద్దని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో వారంతా ఆడిటోరియం వెలుపల తచ్చాడుతూ కనిపించారు.
ఇకపై ప్రతి మంగళవారం ఉదయం గం. 9.35 నిమిషాలకు ఒక్క క్షణం ఆలస్యమైనా పార్టీ ఎంపిలు పార్లమెంట్ సముదాయంలోని బాలయోగి ఆడిటోరియం లోపలికి అనుమతి లభించదు. దశలవారీగా మిగతా సమావేశాల్లోనూ ఈ నిబంధన అమలులోకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.