మీ ఇష్టం.. 40 సీట్లలో మీరు పోటీ చేసుకోండి: బీజేపీపై జేడీయు నేత ఆగ్రహం
పాట్నా: బీహార్లో వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చునని జేడీయూ ప్రధాన కార్యదర్శి సంజయ్ సింగ్ సోమవారం వెల్లడించారు. 2014 ఎన్నికలకు, 2019 ఎన్నికలకు చాలా తేడా ఉందని ఆయన చెప్పారు. మొత్తం 40 సీట్లకు గాను జేడీయు - బీజేపీ మధ్య విభేదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే తమతో పొత్తు వద్దనుకుంటే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే స్వేచ్ఛ బీజేపీకి ఉందని జేడీయూ తేల్చిచెప్పింది. నితీశ్ లేకుండా బీహార్లో తాము గెలవలేమని బీజేపీకి కూడా తెలుసునని, తమతో కనుక పొత్తు వద్దనుకుంటే రాష్ట్రంలోని 40 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేసుకోవచ్చునని చెప్పారు.
అందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. అనవసర, అర్థం పర్థంలేని వ్యాఖ్యలు చేయకుండా పార్టీ నేతల నోళ్లను అదుపులో పెట్టాలని బీజేపీకి సూచించారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. 2014లో గెలిచిన అన్ని లోకసభ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని, ఇటీవల బీజేపీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర సింగ్ చెప్పారు.
అదే సమయంలో మిత్ర పక్షాలను కూడా గౌరవిస్తుందన్నారు. సీట్ల పంపకం సరైన పద్ధతిలో చేసుకోవడం ద్వారా రాష్ట్రంలోని 40 సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుందన్నారు. దీనిపై జేడీయు నేత స్పందించారు.
కాగా, 2014 ఎన్నికల్లో బీజేపీ 22 లోకసభ స్థానాలను గెలుచుకోగా, మిత్ర పక్షాలు మరో తొమ్మిది సీట్లు గెలుచుకున్నాయి. జేడీయూ రెండింటితోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారి ఆ సీట్లన్నీ తమకు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. అది కుదరని పని అని జేడీయూ చెబుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.