స్మగ్లింగ్: రూ.500 కోట్ల పురాతన విగ్రహాలు సీజ్
తమిళనాడులోని ఆలయల్లో ఉన్న పురాతన విగ్రహాలు చోరీ చేసి విదేశాలకు తరలిస్తున్న వల్లభ ప్రకాష్ (68), ఆదిత్య ప్రకాష్ (32) అనే తండ్రీకొడుకులు తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై/చెన్నై: తమిళనాడులోని ఆలయల్లో ఉన్న పురాతన విగ్రహాలు చోరీ చేసి విదేశాలకు తరలిస్తున్న వల్లభ ప్రకాష్ (68), ఆదిత్య ప్రకాష్ (32) అనే తండ్రీకొడుకులు తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ నేపాల్ దేశానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
ముంబై నగరంలో ఇండో-నేపాల్ ఆర్ట్ సెంటర్ నిర్వహిస్తున్న వల్లభ ప్రకాష్, ఆదిత్య ప్రకాష్ గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పురాతన విగ్రహాలు సరఫరా చేస్తున్నారని తమిళనాడు పోలీసు అధికారులు వివరాలు సేకరించారు.
గత 50 ఏళ్లలో తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఉన్న సుమారు వెయ్యి పురాతన విగ్రహాలు చోరీ అయ్యాయని పోలీసు అధికారులు తెలుసుకున్నారు. తమిళనాడులో చోరీ అయిన విగ్రహాలు ముంబైకి తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆధారాలు సేకరించారు.
తమిళనాడు సీఐడీ విభాగం ఐజీ పొన్ మాణిక్యం ముంబై చేరుకుని ఇండో-నేపాల్ ఆర్ట్ సెంటర్ నిర్వహకులకు అనుమానం రాకుండా అక్కడ ఉన్న విగ్రహాలు పరిశీలించారు. అందులో తమిళనాడులో చోరీ అయిన విగ్రహాలు ఉన్నాయని గుర్తించారు.
వెంటనే తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను ముంబై రప్పించి స్థానిక పోలీసుల సహకారంతో వల్లభ ప్రకాష్, ఆదిత్య ప్రకాష్ అనే ఇద్దరిని అరెస్టు చేసి అక్కడ ఉన్న విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. తాము స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ మార్కెట్ లో రూ. 500 కోట్లు ఉంటుందని తమిళనాడు పోలీసు అధికారులు తెలిపారు.