బిజెపికి ఎదురు తిరిగిన 'కాంగ్రెస్ హటావో' నినాదం
న్యూఢిల్లీ: ప్రతి ఎన్నికలోనూ బిజెపి కాంగ్రెస్ హటావో నినాదం ఇస్తూ వస్తోంది. అయితే, ఆ నినాదం తమకే ఎదురు తిరుగుతుందని ఊహించి ఉండదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అదే జరిగింది. కాంగ్రెసు పార్టీ పతనమైంది. కేవలం 9 పైచిలుకు శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఒక్క సేటును కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెసును నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తే ఆ ఓట్లు తమకు ప్రత్యర్థులుగా ఉన్న ఇతర పార్టీలకు పడుతాయనే విషయాన్ని బిజెపి గ్రహించినట్లు లేదు.
బిజెపికి పోలైన ఓట్ల శాతం ఫరవా లేదని అనుకున్నప్పటికీ సీట్లు మాత్రం చెంప పెట్టులా వచ్చాయి. భారతదేశంలో కాంగ్రెసు పార్టీని నామరూపాలు లేకుండా చేయాలనే పట్టుదలతో బిజెపి పని చేసుకుంటూ వస్తోంది. కాంగ్రెసు పార్టీని చిత్తు చేస్తే మరో జాతీయ పార్టీ ఉండదు కాబట్టి తామే దశాబ్దాల తరబడి మనుగడ సాగిస్తామని బిజెపి భావిస్తూ వస్తోంది. కానీ, తప్పకుండా దానికి విరుగుడు ఉంటుందనే విషయం బిజెపికి ఢిల్లీ ఎన్నికలు అనుభవంలోకి తెచ్చాయి.
బిజెపి కేవలం 1.5 శాతం ఓట్లను మాత్రమే కోల్పోయింది. అయితే, 28 సీట్లను అది కోల్పోయింది. గత ఎన్నికల్లో 31 సీట్లు వస్తే ఇప్పుడు మూడు సీట్లు వచ్చాయి. కాంగ్రెసు ఓట్ల శాతం మాత్రం దిమ్మ తిరిగే విధంగా పడిపోయాయి. బిజెపి గెలుస్తుందనే ఆందోళన లేదా ఆమ్ ఆద్మీ ఓడిపోతుందేమోననే అనుమానం కాంగ్రెసు పార్టీని చిత్తు చేసింది. కాంగ్రెసు పార్టీ ఓట్లు పెద్ద మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి పోలైన ఓట్ల శాతం 29 నుంచి 54 శాతానికి పెరిగాయి.
ఇతర చిన్న రాజకీయ పార్టీలకు పోలైన ఓట్లు కూడా గణనీయంగా తగ్గాయి. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలనేది ప్రజల్లో నాటుకుపోయిందని చెప్పడానికి అదే ఉదాహరణ. కాగా, మధ్యతరగతి ఓట్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పడ్డాయి. మధ్యతరగతి తమ వైపు ఉంటుందని బిజెపి భావిస్తూ వచ్చింది. కానీ, అది నమ్మకం మాత్రమేనని తేలిపోయింది.
మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే దర్వాగంజ్, జనక్పురి, కరోల్ బాగ్, చాందినీ చౌక్, పజర్ గంజ్, మోతీ నగర్ ప్రాంతాలు ఆమ్ ఆద్మీ పార్టీకి బ్రహరథం పట్టాయి. సంపన్నవర్గాలున్న ప్రాంతాల్లో బిజెపి కాస్తా మెరుగ్గా కనిపించింది. మిగతా అన్ని వర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. లోకసభ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో బిజెపికి అధికంగా ఓట్లు వచ్చాయి. బిజెపికి అనుకూలంగా వ్యవహరించే వ్యాపార వర్గాలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు.
దిగువ మద్యతరగతి నివసించే దిల్షాద్ కాలనీ, బీఆర్ అంబేడ్కర్ నగర్ కాలనీ, గోవింద్ పురి వంటి ప్రాంతాల్లో ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆమ్ ఆద్మీకి ఓట్లేశారు. సంపన్నవర్గాలు నివసించే ఫ్రెండ్స్ కాలనీ, వసంత్ విహార్, గోల్ఫ్ లింక్స్, డిఫెన్స్ కాలనీ, గ్రేటర్ కైలాస్, హౌజ్ ఖాన్, వసంత్ కుంజ్, లజ్పత్ నగర్, పంజాబీ బాగ్ల్లో బిజెపి తన పట్టును కాపాడుకుంది.