పుదుచ్చేరికి 40 కి.మీ దూరంలో నివర్.. 120 కి.మీ వేగంతో గాలులు, పలుచోట్ల వర్షం
నివర్ తుఫాన్ పుదుచ్చేరి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. పుదుచ్చేరి, మరక్కనం మీదుగా తుఫాన్ తీరం దాటబోతోంది. దీంతో భీతావాహ వాతావరణ పరిస్థితి నెలకొంది.
మరోవైపు తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం ఉదయం నుంచే వర్షం కురిసింది. కడలూరులో 227 మిల్లీ మీటర్లు, పుదుచ్చేరిలో 187 మిల్లీమీటర్లు, కరైకల్లో 84 మి.మీ, చెన్నై 89, నాగపట్నంలో 62 మిమీ వర్షపాతం నమోదైంది. మరో 2 గంటల్లో తుషాన్ తీరం దాటుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తుషాన్ తీరం దాటే సమయలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఇటు తమిళనాడులోని మహాబలిపురంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలో గల మెరినా బీచ్ వద్ద కూడా ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షం కురిసింది. ఇది రెండు, మూడురోజులు కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.