పాజిటివ్ సిగ్నల్.. చట్టసభల్లో తగ్గుతున్న నేరగాళ్లు
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నేరాలతో సంబంధం ఉన్న నేతలు యధేచ్ఛగా ఎన్నికవుతూనే ఉన్నారు. మణిపూర్ మినహా మిగతా రాష్ట్రాల్లో తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్నవారు ఎక్కువవుతున్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నేరాలతో సంబంధం ఉన్న నేతలు యధేచ్ఛగా ఎన్నికవుతూనే ఉన్నారు. మణిపూర్ మినహా మిగతా రాష్ట్రాల్లో తీవ్రమైన నేరాలతో సంబంధం ఉన్నవారు ఎక్కువవుతున్నారు. ఐదు రాష్ట్రాల పరిధిలో 690 మంది ఎమ్మెల్యేల్లో 192 మందికి క్రిమినల్ రికార్డు ఉంది. ఇది మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 27.8 శాతం. వారిలో 140 మంది తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు.
అయితే మూడు రాష్ట్రాల్లో మాత్రం ఎన్నికైన ఎమ్మెల్యేల్లో కళంకితుల సంఖ్య తగ్గుతున్నది. ఐదు రాష్ట్రాల్లో యూపీలో 403 స్థానాలకు 312 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ తన రాజకీయ చరిత్రలో రికార్డు నెలకొల్పింది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది.
ఐదు రాష్ట్రాల్లో 850 మంది అభ్యర్థులపై తీవ్ర నేరాభియోగాలు
ఐదు రాష్ట్రాల పరిధిలో పోటీ చేసిన 1000 మంది అభ్యర్థులపై నేరాభియోగాలు ఉండగా, వారిలో 850 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2012 నుంచి 2017 ఎన్నికల్లోకి వచ్చేసరికి క్రిమినల్ నేరాలు లేని ఎమ్మెల్యేల సంఖ్య 19.2 శాతం పెరిగింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పోలిస్తే యూపీలో నేరాభియోగాలు లేని ఎమ్మెల్యేలు పెరగడం ఆసక్తికర పరిణామమే. 260 మంది ఎమ్మెల్యేలపై ఎటువంటి క్రిమినల్ రికార్డులు లేవు. 2012లో 183 మందిపై నేరాభియోగాలు ఉంటే ఇటీవలి ఎన్నికల్లో 143 మందికి తగ్గిపోయింది. అయితే తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సంఖ్య మాత్రం 2012 నుంచి 2017 నాటికి 98 మంది నుంచి 107 మందికి చేరుకున్నది.
పంజాబ్ అసెంబ్లీలోనూ నేరగాళ్లిలా తగ్గారు..
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన వారిలో క్రిమినల్ నేరాలు లేని ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. 2012లో 16 మంది ఎన్నికైతే 2017లో 19 మందికి చేరుకున్నది. గోవాలోనూ చట్టసభకు ఎన్నికైన నేరగాళ్ల సంఖ్య 10 శాతం తగ్గింది. 2012లో 28 మంది ఎటువంటి నేరాభియోగాలు లేని ఎమ్మెల్యేలు గెలుపొందితే ఈ దఫా 31 మంది విజయం సాధించారు.
మణిపూర్, ఉత్తరాఖండ్లోనూ పెరుగుతున్న అవగాహన
మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ క్రిమినల్ రికార్డులు గల వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే సంఖ్య తగ్గుముఖం పట్టింది. కానీ ఇద్దరు మినహా మణిపూర్ లో ఏ ఒక్క ఎమ్మెల్యేపైనా క్రిమినల్ రికార్డులు లేవు. ఇద్దరు ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్ లో నేరాభియోగాలు లేని ఎమ్మెల్యేల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2012లో నలుగురు ఎన్నికైతే 2017లో అది 14 మందికి చేరుకున్నది. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రికార్డ్స్ (ఎడిఆర్) విశ్లేషణ ప్రకారం 690 మంది ఎమ్మెల్యేల్లో 192 మందిపై కేసులు నమోదు కాగా, వారిలో 140 మందిపై తీవ్ర నేరాభియోగాలు రిజిస్టర్ అయ్యాయి. 540 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు కూడా.
140 మందిపై సీరియస్ అభియోగాలు
తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 140 మందిలో 10 మందిపై హత్యానేరం, 37 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఐదు రాష్ట్రాల పరిధిలో నేరాభియోగాలు గల వారు చట్టసభలకు ఎన్నికైన వారి సంఖ్య 2012తో పోలిస్తే ఇటీవలి ఎన్నికల్లో 33.6 శాతం నుంచి 27.8 శాతానికి పడిపోయింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 36 శాతం మంది ఎమ్మెల్యేలకు క్రిమినల్ రికార్డు కలిగి ఉండగా, వారిలో 26 శాతం మంది తీవ్ర నేరాభియోగాలు కలిగి ఉన్నారు. ఇక బీజేపీ నుంచి గెలుపొందిన 312 మందిలో 83 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2017లో 47 మంది నుంచి 25 మందికి తగ్గిన ఎస్పీలో 11 మంది కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారు.
యూపీలో 8 మంది ఎమ్మెల్యేలపై హత్యానేరం కేసులు
ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై హత్యా నేరం, 34 మంది శాసనభ్యులపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ డిక్లరేషన్లన్నీ ఎన్నికల సంఘానికి అభ్యర్థులు ప్రకటించిన వివరాల్లోనివే. క్రిమినల్ కేసులు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎటువంటి నిషేధం లేదు. నాలుగేళ్లకు పైగా జైలుశిక్ష పడిన వారు మాత్రమే ఎన్నికల్లో పోటీకి అనర్హులు.
సీఎం అమరీందర్ సహా పంజాబ్లో 11 మందిపై అభియోగాలు
ఇక పంజాబ్ రాష్ట్రంలో తీవ్రమైన నేరాభియోగాలు నమోదైన ఎమ్మెల్యేల సంఖ్య ఐదు నుంచి 11 మందికి చేరుకున్నది. వారిలో ప్రస్తుత సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సహా ఏడుగురు ఎమ్మెల్యేలపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఇక గోవాలో తీవ్రమైన కేసులు గల ఎమ్మెల్యేల సంఖ్య ఇద్దరి నుంచి ఆరుగురికి పెరిగింది.