'జల్లికట్టు' రక్తసిక్తం.. లాఠీచార్జితో తిరగబడ్డ ప్రజలు.. అట్టుడికిపోతోంది..
జల్లికట్టు మద్దతుదారులంతా పోలీసుల పైకి తిరగబడటంతో.. పోలీసులు లాఠీలతో వారిని చెదరగొట్టారు.
చెన్నై: జల్లికట్టుపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు తమిళ ప్రజలు. సుప్రీం ఆంక్షలను సైతం లెక్కచేయకుండా.. తమ సాంప్రదాయ క్రీడను నిర్వహించుకునేందుకు ఎద్దులతో వీధల్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.
తాజాగా అలంగనళ్లూరులో పోలీసులకు-జల్లికట్టు మద్దతుదారులకు మధ్య జరిగిన వాగ్వాదంతో పరిస్థితి కాస్త లాఠీ చార్జీ దాకా వెళ్లింది. పశువులకు పూజలు చేసిన అనంతరం వాటిని వీధుల్లోకి తీసుకురాగా, అప్పటికే అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు ప్రజలను అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది.
జల్లికట్టు మద్దతుదారులంతా పోలీసుల పైకి తిరగబడటంతో.. పోలీసులు లాఠీలతో వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో చిన్నా పెద్దా తేడా లేకుండా దొరికిన ప్రతీ ఒక్కరిని లాఠీలతో కొట్టారు. దీంతో అలంగనళ్లూరు రక్తసిక్తమైంది. నాలుగైదేళ్ల చిన్నారులను సైతం పోలీసులు లాఠీలతో కొట్టడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది.
పోలీస్ లాఠీచార్జీని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన జల్లికట్టు మద్దతుదారులు.. వారిపైకి రాళ్లు రువ్వారు. ఇరువర్గాల మధ్య దాడులతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్త రూపం దాల్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించామని అధికారులు చెబుతున్నారు.