కేరళ సీఎం పదవిపై డైలామా : పదవిని పంచుకోనున్న అచ్యుతానందన్, విజయన్
కేరళ : కేరళలో ఎర్ర జెండా రెపరెపలాడుతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నిజం చేస్తూ, యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ను ప్రతిపక్షానికి పరిమితం చేసింది లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్.డీ.ఎఫ్). ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ సాధించిన ఎల్.డీ.ఎఫ్ లో సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
సీఎం రేసులో పోటీ అంతా 92 ఏళ్ల కురువృద్దుడు అచ్చుతానందన్ కు పిన్రాయి విజయన్ కు మధ్యనే నెలకొంది. ఇద్దరిలో సీఎంగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై మే 20వ తేదీన పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన మొదట్లో సీఎంగా విజయన్ కే అవకాశం దక్కుతుందని అంతా భావించినా..! అనూహ్యంగా సీఎం పదవి చేపట్టడానికి తాకు కూడా ఫిట్ గా ఉన్నానని అచ్చుతానందన్ ప్రకటించడంతో దీనిపై డైలామా ఏర్పడింది.
కాగా.. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చల ప్రకారం, ఐదేళ్ల పదవి కాలనికి గాను అచ్యుతానందన్ కి రెండేళ్లు , విజయన్ మూడేళ్లు సీఎంగా కొనసాగే అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోన్నట్టుగా సమాచారం. రాజకీయానుభవం పరంగా అచ్యుతానందన్ చాలా సీనియర్ నాయకులు కాబట్టి తొలి రెండేళ్లు ఆయనకే అవకాశం ఇచ్చే సూచనలున్నాయి. అదీగాక పార్టీ కింది స్థాయి వర్గాల్లో అచ్యుతానందన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఆయన రాజకీయ జీవితంలో పార్టీ కోసం చాలానే కష్టపడ్డారు. అందుకే అచ్యుతానందన్ కోరిక మేరకు తనకు కూడా సీఎంగా అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా.. సీఎం రేసును జటిలం చేయకుండా ఇద్దరికీ అవకాశం ఇచ్చి అసంతృప్తులకు తావివ్వకుండా చేయాలనేది పార్టీ భావన.