బెంగళూరులో మొదటి సారి ఆలయంలో డ్రస్ కోడ్, అర్దనగ్నంగా దర్శనానికి, ప్రభుత్వం!
Recommended Video

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ప్రసిద్ది చెందిన ఆలయంలో మొట్ట మొదటి సారి భక్తులకు డ్రస్ కోడ్ అమలు చేశారు. దేవాదాయ శాఖ అధీనంలో లేకుండా ట్రస్టు సభ్యులు నిర్వహిస్తున్న ప్రసిద్ది చెందిన ఆలయంలోకి ఇష్టం వచ్చినట్లు దుస్తులు వేసుకుని వస్తే అనుమతి ఇవ్వమని ట్రస్టు సభ్యులు తేల్చి చెప్పారు. పలువురు అర్దనగ్నంగా దర్శనానికి రావడం వలనే డ్రస్ కోడ్ అమలు చేశారు.

దేవాదాయ శాఖ
బెంగళూరు నగర, గ్రామీణ ప్రాంతాల్లోని పురాతన ఆలయాలు అన్నీ దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నాయి. అయితే బెంగళూరు- మైసూరు రోడ్డులోని రాజరాజేశ్వరీ నగరలోని రాజరాజేశ్వరీ దేవాలయం దేవాదాయ శాఖ అధీనంలో లేదు.

జీన్స్, టీ షర్టులు
రాజరాజేశ్వరీ నగరలోని రాజరాజేశ్వరీ ఆలయంలోకి లోవేస్ట్ జీన్స్, బర్ముడా, టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని వస్తే లోపలికి అనుమతించమని ట్రస్టు నిర్వహకులు తేల్చి చెప్పారు. భక్తులు సాంప్రధాయ దుస్తులు వేసుకుని ఆలయంలోకి రావాలని దేవాలయం ముందు ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేశారు.

భారీ సంఖ్యలో భక్తులు
రాజరాజేశ్వరీ దేవాలయానికి ప్రతినిత్యం వేలాధి మంది భక్తులు వస్తుంటారు. మంగళ, శుక్ర, ఆదివారాలలో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. గతంలో కొందరు యువతులు అర్దనగ్నం దుస్తులు వేసుకుని ఆలయంలోకి రావడంతో భక్తులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్త్రీ, పురుషులకు డ్రస్ కోడ్
మహిళలు చీరలు, శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే పంజాబీ డ్రస్ లు, వృద్ద మహిళలు శాలువా వేసుకుని వెళ్లాలి. మహిళలు జడ పూర్తిగా వేసుకోవాలని, కొప్పులు పెట్టుకుని రాకూడదని ట్రస్ట్ నిర్వహకులు సూచించారు. పురుషులు దోతీ, పంచె, ప్యాంటు, షర్టులు వేసుకుని ఆలయంలోకి రావాలని సూచించారు.

హిందూ సాంప్రధాయం
అర్దనగ్నంగా దుస్తులు వేసుకుని ఆలయంలోకి రావడంతో భక్తులు అభ్యంతరం చెప్పారని, అందుకే హిందూ సాంప్రధాయం ప్రకారం భక్తులు అందరికీ డ్రస్ కోడ్ అమలు చేశామని రాజరాజేశ్వరీ ఆలయం ట్రస్ట్ నిర్వహకులు తెలిపారు. డ్రస్ కోడ్ నియమాలు తక్షణం అమలోకి వస్తాయని ట్రస్ట్ నిర్వహకులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications