సుబ్రతారాయ్ ఆస్తులు చూసి సుప్రీం కోర్టు దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ ఆస్తులు చూసి సుప్రీం కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుబ్రతా రాయ్ ప్రస్తుతం పెరోల్ మీద ఉన్నారు. అతని పెరోల్ను న్యాయస్థానం జూలై 11వ తేదీ వరకు పొడిగించింది. అయితే, ఆయన ఆస్తుల చిట్టను చూసి సుప్రీం కోర్టు దిగ్భ్రాంతికి గురైంది.
ఆయన ఆస్తుల చిట్టాను చూసిన తర్వాత... సుబ్రతా రాయ్ వంటి వ్యక్తి రెండేళ్ల పాటు తీహార్ జైల్లో ఎందుకు ఉన్నారని వ్యాఖ్యానించింది. అతను చెల్లించాల్సిన మొత్తం, ఆయనకున్న ఆస్తితో పోలిస్తే అత్యంత స్వల్పమని సుప్రీం కోర్టు గుర్తించింది.
అయినప్పటికీ చెల్లింపులు ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటో అర్థం కావడం లేదని పేర్కొంది. పెరోల్ను ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ సుబ్రతా రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ఆస్తుల వివరాలను అందించారు.
చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దవే, ఏకె సిక్రీలు భారత్లో, ఆపై విదేశాల్లో ఉన్న ఆస్తులు, బంగారం, యూరోలు, డాలర్లు, పౌండ్ స్టెర్లింగ్లు తదితర కరెన్సీల్లో విలువ కట్టిన విలువైన కళాఖండాలు తదితరాల వివరాలను చూసి దిగ్భ్రాంతి చెందినట్టు తెలిపారు.
ఆరు నెలలు గడువిస్తే ప్రతి పైసా కూడా చెల్లిస్తారని సుబ్రతా రాయ్ కోర్టుకు తెలిపారు. వీటిని చూసిన తర్వాతనే ఆయనకు మరో ఐదు వారాలు పెరోల్ పొడిగిస్తూ రూ.200 కోట్లను సెబీకి చెల్లించాలని ఆదేశించింది. కాగా, సుబ్రతా రాయ్తో పాటు మరో ఇద్దరు సహారా డైరెక్టర్లకు జూన్ 4 వరకు తొలుత పెరోల్ లభించిన విషయం తెలిసిందే.