ఢిల్లీ ఫలితాలు: కేజ్రీవాల్ ఆప్ విజయానికి కారణాలు పది
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యమైన విజయం సాధించింది. కాంగ్రెసు పార్టీయే కాకుండా బిజెపి కూడా చావు దెబ్బ తిన్నది. ఆమ్ ఆద్మీ పార్టీకి నువ్వా నేనా అని బిజెపి పోటీ ఇస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలను తలదన్నుతూ కేజ్రీవాల్ ఘన విజయం అందుకున్నారు. నిజానికి ఈ ఫలితాలను కేజ్రీవాల్ కూడా ఊహించలేదు. ఆ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. ఆయన విజయానికి కారణాలు ఏమిటనే ఆలోచిస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
1. ముందు నుంచే సిద్ధం కావడం
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చాలా ముందు నుంచే ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతూ వచ్చారు. 2014 లోకసభ ఎన్నికల్లో దెబ్బ తిన్న తర్వాత ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ రంగం తయారు చేసుకుంటూ వచ్చింది. అభ్యర్థుల ప్రకటన నుంచి మానిఫెస్టో విడుదల వరకు బిజెపి, కాంగ్రెసుల కన్నా ఆ పార్టీ ముందున్నది. ఓటర్లతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు తిరిగి సంబంధాలు నెరుపుకోగలిగారు.
2. కేజ్రీవాల్ క్షమాపణ
ప్రతి వ్యక్తికీ రెండో అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలు ఆలోచించినట్లు కనిపిస్తున్నారు. 49 పాలన నుంచి తప్పుకున్న తర్వాత కేజ్రీవాల్ ఓటర్లకు క్షమాపణ చెప్పారు. కేజ్రివాల్ క్షమాపణలో నిజాయితీని ప్రజలు చూశారు. దానికితోడు, తన అనార్కిస్ట్ ఇమేజ్ను శ్రమ పడి తగ్గించుకున్నారు. ప్రత్యర్థులపై ఆయన దాడిని ఎక్కుపెట్టలేదు. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ రెచ్చగొట్టినప్పటికీ ఆయన సంయమనం పాటించారు. కిరణ్ బేడీకి వ్యతిరేకంగా ఆయన ఏమీ మాట్లాడలేదు. దాంతో ఆయన ఇమేజ్ మారిపోయింది. హుందాతనం ఉట్టిపడే విధంగా ఆయన వ్యవహరించారు.
3. మఫ్లర్ మ్యాన్ వర్సెస్ పది లక్షల స్యూట్ వ్యక్తి
దృష్టికోణం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. తన పేరుతో ఉన్న స్యూట్ను ధరించడం నరేంద్ర మోడీకి సాయపడినట్లు లేదు. దాన్ని పది లక్షల రూపాయల విలువ చేసే దుస్తులుగా వెంటనే మీడియా అభివర్ణించింది. అరవింద్ కేజ్రీవాల్ తన మఫ్లర్తో సాదాసీదాగా కనిపించారు.
4. ముస్లింల మద్దతు చూరగొన్న ఆప్
ఎన్నికల గణాంకాలు ఇంకా అందాల్సి ఉన్నప్పటికీ ముస్లింలను తమ వైపు తిప్పుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించినట్లు కనపిస్తోంది. ఆమ్ ఆద్మీకి ముస్లింలు పెద్ద యెత్తున అండగా నిలిచారు. గత శాసనసభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు కాంగ్రెసుకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య చీలిపోయాయి. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి గుండుగుత్తగా ముస్లింలు ఓటేసినట్లు కనిపిస్తున్నారు. బిజెపితో ముఖాముఖి పోటీ జరగడం ఆమ్ ఆద్మీకి కలిసి వచ్చింది.
5. కాంగ్రెసు నష్టం ఆమ్ ఆద్మీకి కలిసి వచ్చింది...
కాంగ్రెసు పార్టీ చావు దెబ్బ తినడం ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చింది. ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ తిరిగి తన పునాదిని పటిష్టం చేసుకోలేకపోయింది. గత ఎన్నికల్లో కన్నా ఈసారి కాంగ్రెసుకు ఓట్లు చాలా తక్కువగా వచ్చాయి. కాంగ్రెసు ఓట్లు చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి దక్కాియ.
6. బిజెపి మితిమీరిన విశ్వాసం
బిజెపి మితిమీరిన విశ్వాసం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చింది. ఢిల్లీ లోకసభ ఎన్నికల్లో బిజెపి పూర్తి స్థానాలను దక్కించుకోవడం దాని విశ్వాసాన్ని పెంచింది. ఢిల్లీ ప్రజలంతా తమ వైపు ఉన్నారనే అతి విశ్వాసం కొంప ముంచింది. దీంతో కేజ్రీవాల్, ఆప్ తిరిగి పుంజుకోవడానికి అవకాశం కల్పించింది. దానికితోడు, బిజెపి ఢిల్లీ శాఖలో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఎక్కువగా నరేంద్ర మోడీ ప్రజాదరణపై, అమిత్ షా వ్యూహాల మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది.
7. కిరణ్ బేడీ ఫ్యాక్టర్ మొదటికే మోసం
కిరణ్ బేడీని కేజ్రీవాల్కు పోటీగా దించడం బిజెపిని దెబ్బ తీసింది. కిరణ్ బేడీ ద్వారా కేజ్రీవాల్ను ఎదుర్కోవచ్చుననే అమిత్ షా వ్యూహం బెడిసికొట్టింది. బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో బిజెపి శ్రేణుల్లో అసంతృప్తి చోటు చేసుకుంది. అన్ని సర్వేల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ కన్నా కేజ్రీవాల్కే ఎక్కువ ఆదరణ లభించింది.
8. ఓటర్లు చీలిపోలేదు...
బిజెపి ఆశించినట్లుగా హిందూ ముస్లిం ఓటర్ల మధ్య తీవ్రమైన చీలిక రాలేదు. హిందువులంతా తమకు ఓటేస్తారనే నమ్మకాన్ని ఢిల్లీ ఫలితాలు దెబ్బ తీశాయి. మత ప్రాతిపదికపై ఓటర్ల చీలికను నివారించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రమైన కసరత్తు చేసింది. జమా మసీదు షాహీ ఇమామ్ బుఖారీ ఇచ్చిన మద్దతును కేజ్రీవాల్ తిరస్కరించడంలో చాలా చురుగ్గా, వేగంగా స్పందించారు. ఇది చాలా వరకు కలిసి వచ్చింది.
9. ఇది మోడీ విషయం కాదు..
ఈ ఎన్నికలతో ప్రధాని మోడీకి ఏ విధమైన సంబంధం లేదు. ఇది ప్రధాని ఎన్నిక కాదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలు కావడంతో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ను ప్రజలు కోరుకున్నారు గత ఎన్నికల్లో కూడా చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్కు, ప్రధాని అభ్యర్థిగా మోడీకి ఓటేస్తామని చెప్పారు. ఈ తేడా ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా పనిచేసింది.
10. ప్రభుత్వ వ్యతిరేకత పనిచేయలేదు..
మిగతా రాష్ట్రాల్లో బిజెపికి కలిసి వచ్చినట్లు ఢిల్లీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కలిసి రాలేదు. ఢిల్లీ రాజకీయ ముఖచిత్రమే వేరుగా ఉంది.