కలిసి చస్తాం: వ్యాపం స్కామ్పై రాష్ట్రపతికి లేఖ
భోపాల్: వ్యాపం కుంభకోణంలో పలువురు విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. గ్వాలియర్ లోని ఓ మెడికల్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న ఐదుగురు విద్యార్థులు రాష్ట్రపతికి ఒక లేఖ వ్రాశారు. లేఖలో వారి ఆవేదనను వెల్లడించారు.
అదే లేఖలో వారు తాము గౌరవంగా చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేశారు. తాము నిత్యం అవమానంతో తలదించుకుని బ్రతుకుతున్నామని విచారం వ్యక్తం చేశారు. సాటి విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తమను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్వాలియర్ లోని మెడికల్ కాలేజ్ లో మనీష్ శర్మ, రాఘవేంద్ర సింగ్, పంకజ్ బన్సాల్, అమిత్ చందా, వికాస్ గుప్త విద్యాభ్యాసం చేస్తున్నారు. 2010లో జరిగిన ఫ్రీ మెడికల్ ఎంట్రన్స్ లో వీరు సీట్లు సంపాదించుకున్నారు.
వ్యాపం స్కాం వెలుగు చూడటంతో 2013లో వీరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.

విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఐదుగురు విచారణకు హాజరైనారు. తరువాత వ్యాపం స్కాంలో వారి పాత్రలేదని వెలుగు చూడటంతో నిర్దోషులుగా బయటపడ్డారు. అయితే సాటి విద్యార్థులు మాత్రం వీరిని వ్యాపం స్కాం నిందితులుగానే చూస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.
తమకు కాలేజ్ లో మొదట చాల గౌరవం ఉండేదని, ఆ గౌరవం ఇప్పుడు కావాలని, లేదంటే తమకు కలిసి చచ్చిపోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్రపతికి లేఖ వ్రాశారు. విషయం తెలుసుకున్న కాలేజ్ విద్యార్థులు, సిబ్బంది హడలిపోయారు.












Click it and Unblock the Notifications