దౌర్జన్యమా: కిరణ్ తీరుపై గీతా కన్నీరు, బిల్లులపై చిద్దూ
తాము మంత్రులమని, అదీ మహిళమని చూడకుండా పోలీసులతో దౌర్జన్యం చేయిస్తారా అని వాపోయారు. తమ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, పక్కకు ఈడ్చి పడేశారని తెలిపారు. సమైక్యం అంటున్న ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కాగా, బుధవారం ప్రారంభమైన ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ తప్ప ఏదయినా ముఖ్యమైన బిల్లు ఆమోదం పొందడం అనుమానాస్పదమేనని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. చట్టాలను ఆమోదించడానికి పార్లమెంటు సమావేశం కాకపోతే, ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఏదయినా ముఖ్యమైన బిల్లుకు ఆమోదం లభిస్తుందా అనేది అనుమానమేనని చిదంబరం అన్నారు.
ప్రతిరోజూ పార్లమెంటుకు వెళ్లడం, వట్టి చేతులతో తిరిగి రావడం అనేది మాకు మామూలయిపోయిందని వ్యాఖ్యానించారు. ఇక్కడి శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన వాణిజ్య సదస్సులో ఆ కళాశాల విద్యార్థుల నుద్దేశించి చిదంబరం మాట్లాడారు. అనంతరం చిదంబరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు, ఓట్ ఆన్ అకౌంట్, అనుబంధ పద్దులను ఆమోదించాల్సి ఉందన్నారు.
అయితే అవి ఎలాంటి చర్చా లేకుండా ఆమోదం పొందితే తాను సంతోషించనని, పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత వాటిని ఆమోదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 21న ముగిసే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో చాలా బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసుకోవాలనుకుంటోన్న విషయం తెలిసిందే.