అనుకున్నంతా అయ్యింది..! జెట్ ఎయిర్ వేస్ సంస్థ తాత్కాలిక లాకౌట్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా ఆర్థక సంక్షోబాన్ని ఎదుర్కొంటున్న జెట్ విమనయాన సంస్థ ఏదోక రోజు మూతపడుతుందని అందరూ ఊహించారు. ఆ తరుణం రానే వచ్చింది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్లో ఆ సంస్థ షేర్లు 30 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. బాంబే స్టాక్ మార్కెట్ లో ఈ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన షేరు విలువ ఒక దశలో 30.28 శాతం పతనమై 168.60 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది.
అటు జాతీయ స్టాక్ మార్కెట్ లో షేరు ధర ఇంట్రాడేలో 34.01 శాతం నష్టంతో 158.70 రూపాయలకి పడిపోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా భారీ నష్టాల్లోనే కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 26 శాతం నష్టంతో 177 రాపాయల వద్ద కొనసాగుతోంది. నిధుల లేమితో అల్లాడిపోతున్న జెట్ ఎయిర్వేస్కు 400 కోట్ల రూపాయల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించాయి.
దీంతో జెట్ తన ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారం రాత్రి అమృత్సర్ నుంచి దిల్లీకి నడుపుతున్న విమానమే ఆఖరిదని సంస్థ ప్రకటించింది. మరోవైపు జెట్ను కొనుగోలు చేసేందుకు ఎవరో ఒకరు ముందుకు వస్తారని రుణదాతలు నేడు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.