చావులోనూ వెంటాడిన 'కులం': గుండె తరుక్కుపోవాల్సిందే.. తల్లి మృతితో ఆ చిన్నారులిలా!
చెన్నై: చాలామంది తల్లులకి కుటుంబమే ఓ ప్రపంచం. పిల్లలే వాళ్ల ఊపిరి. రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లు కుటుంబం కోసమే ఆరాటపడే నిస్వార్థ తల్లులు ఎంతోమంది.
జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే.. తన ప్రేమతో పిల్లలకు ఏ లోటు తెలియనివ్వకుండా పెంచడంలో తల్లి తర్వాతే ఎవరైనా!. అలాంటి తల్లి ఒక్కసారిగా తమకు దూరమైపోతే.. ఈ ప్రపంచంలో తాము ఒంటరైపోయామన్న వేదన వెంటాడుతూనే ఉంటుంది. చెన్నైకి చెందిన ముగ్గురు చిన్నారులు ఇప్పుడిలాంటి వేదనే అనుభవిస్తున్నారు.
అసలేమైంది?:
తమిళనాడులోని కూతంపట్టికి చెందిన విజయ అనే ఒక వితంతువు రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. క్యాన్సర్ ముదిరిపోవడంతో బుధవారం సాయంత్రం ఆమె కన్నుమూసింది. అప్పటిదాకా అమ్మ తమ ప్రపంచంగా బతుకుతున్న చిన్నారులు.. ఆ తల్లి మరణంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
కన్నీరుమున్నీరైన చిన్నారులు:
కనీసం తల్లి శవాన్ని ఇంటికి తరలించేందుకు చిల్లి గవ్వ కూడా వారి చేతిలో లేదు. ఆసుపత్రి వర్గాలు తల్లి మృతదేహాన్ని అప్పగించాక.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అక్కడే ఉండిపోయారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కాసేపటికి ఆసుపత్రి ఆవరణలోనే భిక్షాటనకు దిగి.. కనిపించినవారినల్లా సహాయం కోసం అర్థించారు.
ఓదార్చేవారే లేరు..:
బంధువులు లేక.. చేరదీసేవాళ్లు కానరాక.. ఆ చిన్నారులు తల్లడిల్లిన తీరు వర్ణణాతీతం. ఆ చిన్నారుల ధీన స్థితి చూసి చాలామంది కంటతడి పెట్టుకున్నారు. చివరకు కొంతమంది ముందుకు వచ్చి తలో కొంత ఆర్థిక సహాయం చేసి మృతదేహాన్ని ఊరికి పంపించే ఏర్పాటు చేశారు.
వెంటాడిన 'కులం':
విజయ ఒక దళితురాలు కావడం.. కులాంతర వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులంతా వీరికి దూరమైనట్టు తెలుస్తోంది. అటు భర్త వైపు వారు, ఇటు విజయ తరుపువారు వీరిని చేరదీయలేదు. 15ఏళ్ల క్రితం విజయ వివాహం చేసుకోగా.. అప్పటినుంచి బంధువులంతా వీరి కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. ఆఖరికి ఆమె చనిపోయాక కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విచారకరం.
ఆ ముగ్గురూ దిక్కుతోచని స్థితిలో..:
ఏడేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది విజయ. ముగ్గురు పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడింది. కొద్దిరోజుల క్రితమే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంచానికే పరిమితమైంది. దీంతో పెద్ద కుమారుడు మోహన్ రాజ్(15) స్థానిక బేకరీలో పనికి కుదిరి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడిలా తల్లిని పోగొట్టుకోవడంతో ఆ ముగ్గురు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది.