జిఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం, అగ్రదేశాల సరసన
నెల్లూరు: భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు. సంక్లిష్టమైన క్రయోజనిక్ ఇంజిన్ పరిజ్ఞానంపై భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పట్టు సాధించింది. స్వదేశీ సామర్థ్యంతో రూపొందిన క్రయో ఇంజిన్తో జియో సింక్రనన్ శాటిలైట్ లాంచ్ వెహిక్ల్-డి5(జిఎస్ఎల్వీ-డి5) రోదసీలోకి దూసుకెళ్లింది. వరుస విఘ్నాలు ఎదురవుతున్నా జిఎస్ఎల్వి ప్రయోగాన్ని ఎట్టకేలకు సక్సెస్ బాటలోకి తీసుకొచ్చారు. దీంతో రెండు దశాబ్దాల కల సాకారం కావడంతో అగ్రదేశాల సరసన భారత్ చేరింది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్రయోజనిక్ (అతిశీతల ఇంజన్) తయారీలో సఫలీకృతం కావటం జిఎస్ఎల్వి ప్రయోగ విజయవంతానికి దోహదపడిందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి డి-5 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ 29 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగి వాతావరణం అనుకూలించడంతో రాకెట్ నింగిలోకి ఎగిరింది. ప్రయోగ సమయంలో రాకెట్ బరువు 414 టన్నులు. ఎత్తు 49.13మీటర్లు. ఈ రాకెట్ ద్వారా సమాచార రంగానికి చెందిన జిశాట్-14 ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 36వేల కిలోమీటర్ల వృత్తాకార భూస్థిర కక్ష్యలో 74వేల తూర్పు రేఖాంశం వద్ద ఉపగ్రహాన్ని స్థిరపర్చారు.
క్రయోజనిక్ ఇంజన్ సాంప్రదాయక ఘన, ద్రవ ఇంధనాల కన్నా అధిక సామర్థ్యం ప్రదర్శిస్తుంది. అందువల్లనే ఎంతో సంక్లిష్టమైన జిఎస్ఎల్వి ప్రయోగంలో క్రయోజనిక్ ఇంజన్ను ఉపయోగించారు. గతంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న క్రయోజనిక్ ఇంజన్లు వైఫల్యం చెందుతుండటంతో, ఇస్రో ఆధ్వర్యంలోనే ఈ ఇంజన్ తయారీకి కృషి చేసి విజయానికి శాస్తవ్రేత్తలు తోడ్పడ్డారు. సమాచార రంగానికి సంబంధించి రూపొందించిన 1982 కిలోల బరువుతో తయారైన జిశాట్-14 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్తవ్రేత్తల కృషి సఫలీకృతమైంది.
నిర్దేశించిన కక్ష్యలోకి చేరిన తరువాత ఉపగ్రహం 851 కిలోల బరువు మాత్రమే. ఈ ఉపగ్రహం పన్నెండేళ్లపాటు సమాచార వ్యవస్థలో విస్తృతమైన సేవలు అందించనుంది. జిశాట్-14 ఉపగ్రహం సమాచార ఉపగ్రహాల్లో 23వది కావడం విశేషం. షార్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది జిఎస్ఎల్వి ప్రయోగాలు నిర్వహించగా, అందులో నేటి విజయంతో కలిపి ఆరు మాత్రమే సక్సెస్ బాటపట్టాయి. జిశాట్ ద్వారా 6 సిబ్యాండ్, 6కెయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అందుబాటులోకి రానున్నట్టు శాస్తవ్రేత్తల బృందం చెప్తోంది.
2007 తరువాత షార్లో జిఎస్ఎల్వి ఇప్పుడే విజయవంతమైంది. ప్రస్తుతం జిశాట్-14 74 డిగ్రీల వృత్తాకార భూస్థిర కక్ష్యలు ఇన్శాట్-3, ఇన్శాట్-4సిఆర్, కల్పన, ఉపగ్రహాల సరసన చేరింది. ఈ ప్రయోగం మూడు దశల్లో రాకెట్ సరాసరి సెకనుకు 9.78 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఇస్రో విజయాల పరంపరలో తొలినాళ్లలో ఆర్యభట్ట ఆ తర్వాత ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి ప్రయోగాలతో ఎలా ఘనత సాధించిందో ఇప్పుడు క్రయోజనిక్ తయారీతో అంతే ప్రాచుర్యం పొందినట్టని శాస్తవ్రేత్తలు స్పష్టం చేస్తున్నారు.