నాలుగు దశాబ్దాల రికార్డు బ్రేక్..! సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టనున్న ప్రధానిగా మోడీ..
ఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోడీ ప్రభంజనం కనిపిస్తోంది. కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలుస్తోంది. సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ సొంతంగా రెండోసారి మేజిక్ ఫిగర్ సాధించిన మోడీ చరిత్ర సృష్టించనున్నారు. 48 ఏళ్లలో ఏ ప్రధాని సాధించని రికార్డు సొంతం చేసుకోనున్నారు. ఇందిరాగాంధీ అనంతరం వరుసగా రెండోసారి సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించిన ప్రధానిగా నరేంద్రమోడీ నిలవనున్నారు.
సంపూర్ణ మెజార్టీ సాధించిన చివరి ప్రధానిగా ఇందిర
సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించి వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చివరి ప్రధాని ఇందిరా గాంధీ. 1967లో యునైటెడ్ కాంగ్రెస్ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1971లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏ పార్టీ కూడా ఆ ఘనత సాధించలేకపోయాయి. అధికారం చేపట్టేందుకు మిత్రపక్షాల సాయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
1952 నుంచి సాధించిన మెజార్టీ
1951 -52లో తొలి లోక్సభకు 543సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 398 స్థానాల్లో గెలిచి అఖండ మెజార్టీ సాధించింది. రెండో లోక్సభలోనూ నెహ్రూ నేతృత్వంలో ఆ పార్టీ 537లో 394 సీట్లు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ 540లో 394 సీట్లు సాధించి మరోసారి విజయ ఢంకా మోగించింది. 1967లో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 553లో 303 సీట్లు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1969లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ (ఆర్), కాంగ్రెస్ (ఓ)గా విడిపోయింది. 1971లో జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ (ఆర్) 553లో 372సీట్లు గెల్చుకుని సత్తా చాటింది.
ఇందిర హత్యతో రాజీవ్కు సానుభూతి
ఎమర్జెన్సీ అనంతరం 1977లో ఐదో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా కాంగ్రెసేతర పార్ట అధికారం చేపట్టింది. అప్పట్లో జనతా పార్టీ 557 సీట్లలో 302 గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రెండేళ్లలో ఇద్దరు ప్రధానులను మార్చడం, సుస్థిర పాలన అందించకపోవడంతో 1980లోనే ఎన్నికలు నిర్వహించారు. 1980లో 7వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి ప్రభంజనం సృష్టించింది. 566లో 377సీట్లు గెల్చుకున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1984లో ఆమె హత్య నేపథ్యంలో సానుభూతి ఓట్లతో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ గ్రాండ్ విక్టరీ సాధించారు. అప్పట్లో కాంగ్రెస్ 567సీట్లలో 426 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది.
1989 నుంచి 2014 వరకు మైనార్టీ ప్రభుత్వాలు
1984లో చివరిసారిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1989 నుంచి 2014 వరకు ఏర్పడిన ప్రభుత్వాలన్నీ మిత్రపక్షాల దయపై ఆధారపడి మనుగడ కొనసాగించాయి. 1989లో 195 స్థానాల్లో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. రాజీవ్ గాంధీ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకురాలేదు. దీంతో వీపీ సింగ్ ప్రధానిగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే మెజార్టీ లేని కారణంగా ఆ ప్రభుత్వం కేవలం సంవత్సరం పాటే మనుగడ సాగించింది.
మిత్రపక్షాల సాయంతో కాంగ్రెస్ ప్రభుత్వం
1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 252 సీట్లు గెల్చుకుంది. పీవీ నర్సింహారావ్ ప్రధానిగా ఏర్పడిన మైనార్టీ ప్రభుత్వం మిత్రపక్షాల సాయంతో ఐదేళ్లు కొనసాగింది. 1996లో 11వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. వాజ్పేయి ప్రధాని అభ్యర్థిగా సాగిన ఎన్నికల్లో బీజేపీ 163సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 140స్థానాల్లో గెలిచి సెకండ్ ప్లేస్లో నిలిచింది. బొటాబొటి మెజార్టీతో బీజేపీ అధికారం చేపట్టినా వాజ్పేయి కేవలం 13 రోజుల పాటే అధికారంలో కొనసాగారు. ఆ తర్వాత దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానులుగా రెండేళ్ల పాటు ప్రభుత్వం కొనసాగినా.. 1998లో మధ్యంతర ఎన్నిక తప్పలేదు.
బీజేపీకి మూన్నాళ్ల ముచ్చట
1998లో 12వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో 183 సీట్లు గెల్చుకున్న బీజేపీ మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే 1999లో జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి మధ్యంతర ఎన్నికలు తప్పలేదు. 1999 ఎన్నికల్లో 189 సీట్లు సాధించిన బీజేపీ.. ఎన్నికల ముందు కుదుర్చుకున్న పొత్తుల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ తొలిసారి ఐదేళ్ల పాటు దేశాన్ని పాలించింది.
మిత్రపక్షాలు మద్దతుతో యూపీఏ
2004లో 14వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 159సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మిత్రపక్షాల మద్దతుతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఐదేళ్ల పాటు కొనసాగారు. 2009లోనూ మన్మోహన్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ 159 సీట్లు గెల్చుకుని యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2014లో 282 సీట్ల క్లియర్ మెజార్టీ సాధించిన బీజేపీ నరేంద్రమోడీ ప్రధానిగా ఐదేళ్ల పాటు పాలన కొనసాగించింది. 2019లోనూ మేజిక్ ఫిగర్ను సొంతంగా సాధించిన ఆ పార్టీ దాదాపు 4దశాబ్దాల చరిత్రను తిరగరాసింది.