రాహుల్ విదూషకుడు...చెప్పిన అబద్ధమే మళ్లీ చెబుతున్నారు: అరుణ్ జైట్లీ
రాఫెల్ ఒప్పందం, పారిశ్రామికవేత్తలకు రూ.2లక్షల50వేల కోట్లు రుణాలు మాఫీ చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక విదూషకుడిలా పదేపదే అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ. రాఫెల్ ఒప్పందంపై అబద్ధాలు చెప్పారని... నాన్ పర్ఫామింగ్ అసెట్స్ పై అబద్దాలు చెప్పారని ఇలా... ప్రతీదీ అబద్దం చెప్పడం వల్ల ప్రజలకు మీరు అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. ప్రజలకు చెప్పాల్సిన విషయాలు సత్యదూరంగా ఉండకూడదని చెప్పిన జైట్లీ... అది తమాషా చేయడం కాదని అన్నారు. చేసే పనులు సీరియస్గా ఉండాలని.. అది కేవలం కన్నుగీటడమో లేక కౌగలించుకోవడమో అన్నట్లుగా ఉండకూడదని అన్నారు.
ఒక సీరియస్ అంశాన్ని చర్చించేటప్పుడు దాన్ని పక్కదారి పట్టించడం సరికాదని ఒక విదూషకుడిలా పదేపదే అబద్ధాలు చెప్పడం తగదని జైట్లీ తన ఫేస్బుక్ పోస్టులో రాసుకున్నారు. యూపీఏ హయాంలోనే రుణ ఎగవేతదారులు రుణాలు పొందారని అది మరువకూడదని జైట్లీ అన్నారు.
ఆ రుణాలను రికవర్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అదే సమయంలో రుణాలను రికవర్ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు చాలా భేషుగ్గా ఉన్నాయన్నారు.
"యూపీఏ హయాంలో రుణాలు ఇచ్చి వాటిన రికవర్ చేయడంలో విఫలమైంది. అదే సమయంలో రుణాలు ఎగ్గొట్టిన వారిపై ఒక్క చర్య తీసుకోలేదు సరికదా..వారిని కనీసం విచారణ కూడా చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే రుణాలు పొందిన వారు బ్యాంకులకు సమాధానం చెప్పేలా ఐబీసీని ప్రవేశపెట్టింది. రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే యూపీఏ సర్కార్ బడాబాబులు బ్యాంకులను లూటీ చేసేందుకు అనుమతిచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే బ్యాంకులు సొమ్మును రికవరీ చేస్తున్నాయి"అని జైట్లీ అన్నారు.
ఇక ప్రజాస్వామ్యంలో అబద్దాల చెబుతూ జీవించేవారు ప్రజాసేవకు పనికిరారని రాహుల్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అరుణ్ జైట్లీ. చాలా మంది ఇలా అబద్దాలు చెప్పే రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు.