బిడ్డను చూసి వదలమని ప్రాదేయపడ్డాడు..కనికరం లేకుండా కాల్చి చంపారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఢిల్లీలోని ఆదర్శ్నగర్లో నగల దుకాణం నడుపుతున్న 40 ఏళ్ల హేమంత్ కౌశల్ అనే వ్యక్తిని దుండగులు అతిసమీపం నుంచి కాల్చి చంపారు.
వివరాల్లోకి వెళితే... మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు హేమంత్ అతని 13 ఏళ్ల కుమారుడితో కలిసి దుకాణంలో మాట్లాడుతుండగా...ముగ్గురు దొంగలు హెల్మెట్లు ధరించి దుకాణంలోకి చొరబడ్డారు. ముందుగా దుకాణంలో పనిచేసే అశోక్ కుమార్ అనే వ్యక్తిపై తుపాకి ఎక్కుపెట్టి ఓనర్ను పిలవాల్సిందిగా బెదిరించారు. ఇది గమనించిన హేమంత్ కుమార్ అక్కడికి వచ్చాడు. వెంటనే హేమంత్ను అశోక్ను కింద పడుకోవాలని దొంగలు బెదిరించారు. లోపల ఉన్న హేమంత్ కుమారుడిని కూడా బయటకు వచ్చి కిందపడుకోవాలని బెదిరించారు. పిల్లాడిని వదిలేయాలని నగలను మొత్తం తీసుకెళ్లమని భయంతో చెప్పాడు హేమంత్.
దొరికిన నగలన్నీ దొరికినట్టే దోచుకున్న దొంగలు... బయటకు వెళుతున్న సమయంలో తమ బిడ్డల భవిష్యత్తు కోసం కొంత బంగారం వదిలేయాల్సిందిగా హేమంత్ ప్రాధేయపడ్డాడు. ఇదే సమయంలో ఒక దొంగను ఆపే ప్రయత్నం చేశాడు హేమంత్. కొంత పెనుగులాట జరగడంతో మరో దొంగ హేమంత్ను అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. కన్న కొడుకు ముందే హేమంత్ రక్తపు మడుగులో కుప్పకూలాడు. వెంటనే దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
షాక్ నుంచి తేరుకున్న హేమంత్ ముందుగా పోలీసులకు ఫోన్ చేసి... ఓ రిక్షాలో తండ్రి హేమంత్ను హాస్పిటల్కు చేర్చాడు. అయితే అప్పటికే తండ్రి మృతి చెందాడని వైద్యులు ధృవీకరించడంతో చిన్నారి గుండెలవిసేలా రోధించాడు. హాస్పిటల్లో ఈ దృశ్యాన్ని చూసిన వారి కంట నీరు ఆగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.