కర్ణాటక ఉప ఎన్నికలు, కాంగ్రెస్ కైవసం: బీజేపీ వాష్ఔట్, నో మోడీ ఎఫెక్ట్ !
కర్ణాటకలోని నంజనగూడు, గుండ్లుపేట శాసన సభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేశవమూర్తి, గీతా మహదేవప్రసాద్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో బీజేపీ వాష్ ఔట్ అయ్యింది.
మైసూరు: కర్ణాటకలో రెండు శాసన సభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో బీజేపీ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు.
చామరాజ నగర జిల్లాలోని గుండ్లుపేటలో దివంగత మంత్రి మహదేవప్రసాద్ ఆకస్మిక మరణంతో ఆయన భార్య గీతా మహదేవప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ నుంచి నిరంజన్ కుమార్ పోటీ చేశారు.
సానుభూతి పని చేసింది
గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి నిరంజన్ కుమార్ పై కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహదేవప్రసాద్ 12,007 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గుండ్లుపేట నియోజక వర్గాన్ని మళ్లీ అదే పార్టీ కైవసం చేసుకుంది.
మంత్రి పదవిరాలేదని తిరుగుబాటు చేస్తే !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై తిరుగుబాటు చేసి మైసూరు జిల్లాలోని నంజనగూడు నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనా చేసిన శ్రీనివాస ప్రసాద్ బీజేపీలో చేరారు. తరువాత నంజనగూడు నియోజక వర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.
కొత్తగా వచ్చి తన్నుకుపోయారు
ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన కళలే కేశవమూర్తి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. గత రెండు సార్లు జేడీఎస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభ ఎన్నికల్లో పోటీచేసిన కేశవమూర్తి ఓడిపోయారు. అయితే 2017 నంజనగూడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్ కేశవమూర్తి 18,307 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కాంగ్రెస్ దెబ్బతో బీజేపీ ఇంటికి
రెండు నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆపార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ నాయకులు మాత్రం ఇళ్లకే పరిమితం అయ్యారు. గతంలో రెండు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు.
మేం మారం అంటున్న కాంగ్రెస్ కార్యకర్తలు
నంజనగూడు, గుండ్లుపేట నియోజక వర్గాలు కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు మళ్లీ ఆ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని మళ్లీ అక్కడి కార్యకర్తలు నిరూపించారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రభావం కొంచెం కూడా కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.