టీ నోట్పై కావూరి, చిరు, పళ్లంరాజు, కోట్ల రాజీనామా?
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, వారి రాజీనామా వార్తలను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినందుకు నిరనసగా వారు తమ పదవులకు రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. చిరంజీవి కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సహాయ మంత్రిగా ఉంటూ పర్యాటక శాఖను స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు. రాయలసీమకు చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పెట్టన నోట్ను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాదును కనీసం కేంద్ర పాలిత ప్రాంతంగానైనా ప్రకటించడకపోవడం పట్ల కావూరి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఏకపక్షంగా చేశారని కావూరి మంత్రి వర్గ సమావేశంలో అన్నారు. సమస్యలను వినడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని, సమస్యలను ఆ బృందానికి వినిపించచ్చునని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.
మంత్రుల బృందం త్వరలోనే ఏర్పాటవుతుందని, దానికి నెల రోజుల సమయం ఉంటుందని, అన్ని విషయాలు దాంతో చెప్పుకోవచ్చునని ఆయన అన్నారు. సీమాంధ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కూడా ఆయన అన్నట్లు చెబుతున్నారు.
కావూరి సాంబశివరావు, పళ్లంరాజు నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా ధ్రువీకరించినట్లు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి. సీమాంధ్ర నుంచి కేంద్ర మంత్రివర్గంలో మరో కేబినెట్ మంత్రిగా కిశోర్ చంద్రదేవ్ ఉన్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల మంత్రివర్గ సమావేశానికి రాలేదు.
సీమాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు వ్యతిరేకించినప్పటికీ మెజారిటీ ఉండడంతో తెలంగాణ నోట్కు మంత్రివర్గం ఆమోదం లభించింది. తెలంగాణ నోట్ను ఆమోదించిన విషయాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియా ప్రతినిధుల వద్ద ధ్రువీకరించారు.