టి మేమే ఇచ్చాం, కొన్ని చట్టాలు తేలేకపోయాం: ప్రధాని
నల్గొండ: అమరుల త్యాగం వృథా కాలేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నో నష్టాలకు ఓర్చి తెలంగాణను ఇచ్చిందని ప్రధాని మన్మోహన్ సింగ్ నల్గొండ జిల్లా భువనగిరి సభలో శనివారం అన్నారు. తెలంగాణ తమ వల్లనే వచ్చిందని కొన్ని చిన్నా చితక పార్టీలు చెప్పుకుంటున్నాయని తెరాసను ఉద్దేశించి అన్నారు. అనేక అడ్డంకులు అధిగమించి కాంగ్రెసు పార్టీ తెలంగాణను ఇచ్చిందని చెప్పారు. తమ వల్లే తెలంగాణ వచ్చిందని కొందరు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైనందున ఇక రాష్ట్రాన్ని ఉన్నతస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.
అమరవీరుల త్యాగం వృథా కాలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెసు పార్టీ గుర్తించి తెలంగాణ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెసు పార్టీదే ఏర్పడాలన్నారు. తద్వారా భావితరాలకు గట్టి పునాదులు వేయాలన్నారు. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. బిజెపి ఎన్నికల ప్రచారం ఒక వ్యక్తిని చుట్టు తిరుగుతోందన్నారు. అది సరికాదన్నారు.
తెలంగాణ వచ్చినందున తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలు అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెసు పార్టీ అర్థం చేసుకోగలదన్నారు. బిజెపి చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి అన్నారు. మోడీ ఆచరణ సాధ్యం కాని, అసంబద్ధ హామీలు ఇస్తున్నారన్నారు. యూపిఏ పదేళ్ల కాలంలో పేదరికం మూడోంతలు తగ్గిందన్నారు. వైద్య, విద్య.. ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెసు ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లిందన్నారు.
మీ తీర్పుతోనే రెండుసార్లు అధికారంలోకి వచ్చామన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బిజెపి అజెండా అన్నారు. మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసు పార్టీ, సోనియా గాంధీయే అన్నారు. కొన్ని ముఖ్య చట్టాలకు బిజెపి అడుగడుగునా అడ్డుపడిందని, అందుకే వాటిని తీసుకు రాలేకపోయామని మన్మోహన్ చెప్పారు.
లౌకికవాదాన్ని దెబ్బతీయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయన్నారు. తమకు అధికారం ఇస్తే దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను ఉంచుతామన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఏప్రిల్ 30న మీరు అద్భుతమైన తీర్పు ఇస్తారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.