రేపే మోడీ క్యాబినెట్ పునర్వ్యస్థీకరణ: టిడిపికి బెర్త్ దక్కేనా?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. గురువారంనాడు ఆయన తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. పునర్వ్యస్థీకరణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి ఒక్క మంత్రి పదవి దక్కవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఆ ఒక్క మంత్రి పదవి కోసం టిడిపిలోని పలువురు పార్లమెంటు సభ్యులు పోటీ పడుతున్నట్లు కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ పునర్వ్యస్థీకరణ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న చేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తారా అనేది అనుమానంగానే ఉంది.
మంత్రివర్గంలో భారీగానే మార్పులు ఉంటాయని అంటన్నారు. ఉత్తరప్రదేశ్ శానససభతో పాటు ఉత్తరాఖండ్ శాసనసభకు కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం లభించవచ్చునని అంటున్నారు. అలాగే, ప్రాంతీయ, కుల సమీకరణలను కూడా దృష్టిలో పెట్టుకుంటారని చెబుతున్నారు.
కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. మంత్రులకు సంబంధించిన ప్రధాన శాఖల్లో మార్పు ఉండబోదని అంటున్నారు. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి నిహాల్ చంద్కు, మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాకు ఉద్వాసన పలకవచ్చునని అంటున్నారు.
రాజస్థాన్ నేత అర్జున్ మేఘవాల్, జబల్పూర్ ఎఁపి రాకేశ్ సింగ్, అసోంకు చెందిన ఎంపి రమణ డేకాతో పాటు బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్ర బుద్దేలను మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సహాయ మంత్రిగా ఉన్న సంజీవ్ బల్యాన్కు ప్రమోషన్ ఇచ్చి స్వతంత్ర బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా అప్నా దళ్ ఎఁపి అనుప్రియ పటేల్ కూడా మంత్రివర్గంలోకి రావచ్చునని ప్రచారం సాగుతోంది.