రెచ్చగొట్టేలా వద్దు: మోడీ హెచ్చరిక, ఆరెస్సెస్ చీఫ్ హామీ!
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఆరెస్సెస్ శ్రేణులకు ఆ సంస్థ సూచించింది. వ్యాఖ్యల విషయంలో వీరిని కట్టడి చేస్తామని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ ప్రధాని నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు.
ఓ పక్క అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తుంటే, మరోపక్క ఇటీవలి కాలంలో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయని ఆరెస్సెస్ చీఫ్ దృష్టికి మోడీ తీసుకు వచ్చారని తెలుస్తోంది. వీరు చేసే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు ఒక్కటయ్యేందుకు ఉపయోగపడతాయని ఆయనకు చెప్పారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మోడీకి మోహన్ భాగవత్ హామీ ఇచ్చారు. ఇటీవల కేంద్రమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి, ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. వారి వ్యాఖ్యలకు తాము మద్దతు ఇవ్వలేదని మోడీకి భాగవత్ చెప్పారు.
రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలు వద్దు: మోడీ
మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలు చేయటంద్వారా ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని, అభివృద్ధి లక్ష్యాన్ని దెబ్బతీసే అవకాశాన్ని ప్రతిపక్షానికి ఇవ్వకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి చెందిన ఎంపిలు, మంత్రులు, నాయకులను ఆదేశించారని సమాచారం.
ఈ విషయాన్ని మోడీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ద్వారా అందరికి పంపించినట్లుగా చెబుతున్నారు. మతపరమైన లేదా ఇతర వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేయవద్దని మోడీ ఇప్పటికే ఒకసారి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచించారు.