Monkeypox: అక్కడ మరో పాజిటివ్ కేసుః హైఅలర్ట్ః రాష్ట్ర సరిహద్దుల మూసివేతపై
తిరువనంతపురంః ప్రమాదకరమైన మంకీపాక్స్ ఇప్పటికే భారత్లో అడుగు పెట్టింది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. ఇదివరకు ఈ నెల 12వ తేదీన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నుంచి తిరువనంతపురానికి చేరుకున్న 35 సంవత్సరాల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. కొల్లంకు చెందిన ఆ వ్యక్తికి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా- పాజిటివ్గా నిర్దారణ అయినట్లు కేరళ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పారు. ఇప్పుడదే రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు నమోదైంది.
ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా నిర్మూలన కావట్లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉదయం జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 16,935గా నమోదైంది. 16,069 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 51 మంది మరణించారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,44,264కు చేరింది. పాజిటివిటీ రేటు 6.48 శాతంగా నమోదైంది.
ఈ పరిస్థితుల మధ్య మంకీపాక్స్ కూడా భారత్కు విస్తరించడం మొదలు పెట్టింది. దీన్ని నియంత్రించడానికి కేరళ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకున్నప్పటికీ.. ఫలించట్లేదు. తాజాగా రెండో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 31 సంవత్సరాల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం బాధితుడు పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నాడు.
అతని ఆరోగ్య పరిస్థితి బాగుందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతని ప్రైమరీ, సెకెండరీ కాంటాక్ట్స్ గురించి ఆరా తీస్తున్నట్లు చెప్పారు. కేరళలో మంకీపాక్స్ రెండో పాజిటివ్ కేసు నమోదు కావడం పట్ల పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు సైతం అప్రమత్తం అయ్యాయి. సరిహద్దుల్లో తనిఖీలను నిర్వహించే దిశగా అడుగులు వేస్తోన్నాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారిపై నిఘా ఉంచేలా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. ప్రత్యేకించి- విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించింది. ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేసే వారు- అనారోగ్యానికి గురైన వారిని, శరీరంపై గాయాలు ఉన్న వారిని కలుసుకోకూడదని సూచించింది. అటవీ జంతువులతో పాటు ఎలుకలు, ఉడతలు, కోతుల జీవించి ఉన్నా లేదా మరణించినా ఆ పరిసరాల్లో ఉండకూడదని పేర్కొంది.