Reliance Jio: ముఖేష్ అంబానీ రాజీనామా: 5జీ స్పెక్ట్రమ్ వేలం వేళ: కేవీ చౌదరికి కీలక బాధ్యతలు
ముంబై: దేశీయ టెలికం రంగాన్ని శాసిస్తోన్న కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ జియోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానాలు మారిపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన పదవికి రాజీనామా చేశారు. ఉన్నట్టుండి రిలయన్స్ జియో నుంచి తప్పుకొన్నారు. అదే సమయంలో తన కుమారుడికి కీలక బాధ్యతలను అప్పగించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా అపాయింట్ చేశారు. ఈ విషయాన్ని రిలయన్స్ జియో యాజమాన్యం వెల్లడించింది.
లార్జెస్ట్ టెలికం సెగ్మెంట్గా..
దేశీయ టెలికం సెగ్మెంట్ను ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తోంది రిలయన్స్ జియో. అత్యధికమంది సబ్స్బ్రైబర్లు ఉన్న సంస్థ ఇదే. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలను మించిన సబ్స్క్రిప్షన్ను సాధించిందీ కంపెనీ. రిలయన్స్ జియో-41.1, భారతి ఎయిర్టెల్-21.5, వొడాఫోన్ ఐడియా-12.2 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే కొత్తగా 16.8 లక్షల మంది యూజర్లు జియో సబ్స్క్రిప్షన్ పొందారు.
జియోలో మార్పులు..
లార్జెస్ట్ ప్రైవేట్ టెలికం కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్ జియోలో కొత్త నియామకాలు, మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇన్నిరోజులూ డైరెక్టర్గా కొనసాగిన ముఖేష్ అంబానీ.. తన పదవికి రాజీనామా చేశారు. కుమారుడు ఆకాశ్ అంబానీని ఛైర్మన్గా నియమించారు. సోమవారమే ఆయన రాజీనామా చేసినట్లు జియో యాజమాన్యం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
కేవీ చౌదరికి..
జియో మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ నియమితులయ్యారు. సోమవారమే ఆయన బాధ్యతలను స్వీకరించారు కూడా. అదనపు డైరెక్టర్గా ఉన్న రమీందర్ సింగ్ గుజ్రాల్ను ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించింది. ఆయనతో పాటు కేవీ చౌదరి కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. కేవీ చౌదరి స్వస్థలం కృష్ణా జిల్లా 1978 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ఇదివరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఛైర్మన్గా పని చేశారు.
అయిదేళ్ల పాటు..
రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరి అయిదు సంవత్సరాల పాటు రిలయన్స్ జియో బోర్డ్లో అదనపు డైరెక్టర్లుగా కొనసాగుతారు. ఆయా మార్పులతో కూడిన తీర్మానాన్ని రిలయన్స్ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు. దీనిపై స్టేక్ హోల్డర్స్ ఇంకా ఆమోదం తెలియజేయాల్సి ఉంది. సోమవారం సుదీర్ఘంగా సాగిన బోర్డు డైరెక్టర్లు.. ఈ మార్పులు చేర్పులతో కూడిన ప్రతిపాదనలను ఆమోదించారు.
5జీ స్పెక్ట్రమ్ వేలం వేళ..
5జీ స్పెక్ట్రమ్ను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గం ఈ మేరకు ఈ అనుమతులను మంజూరు చేసింది. జులై చివరి వారం నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది. ఈ పరిస్థితులో- రిలయన్స్ జియోలో కీలక మార్పులు చోటు చేసుకోవడం కార్పొరేట్ సెక్టార్లో చర్చనీయాంశమైంది. ఏకంగా ముఖేష్ అంబానీ తప్పుకోవడం ఆసక్తి రేపుతోంది.