మోడీకి నితీష్ మళ్లీ కితాబు, వారు మాత్రం కాదన్నారు
నోట్ల రద్దు పైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి పొగిడారు. మోడీ నిర్ణయంతో దేశానికి మేలు జరుగుతుందన్నారు.
పాట్నా: నోట్ల రద్దు పైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి పొగిడారు. మోడీ నిర్ణయంతో దేశానికి మేలు జరుగుతుందన్నారు. మోడీ నోట్ల రద్దు పైన విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని నితీశ్ ప్రశంసించారు. కానీ ఆయన బీహార్లో రైతులు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీనివల్ల తామెన్నో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు కేంద్రం 80 మంది సీనియర్ అధికారులను అన్ని రాష్ట్రాలకు పంపించింది.
వారిలో ముగ్గురు బీహార్ వెళ్లారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడారు. ఈ అధికారులంతా ప్రజల నుంచి ఫిర్యాదుల చిట్టాతో తిరిగి వచ్చారు. పేరు చెప్పని ఓ అధికారి మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలందరూ తమకు రకరకాల సమస్యలు ఎదురయ్యాయని చెప్పారన్నారు.
రైతులు అసంతృప్తితో ఉన్నారని, పాత నోట్లతో రుణాలు చెల్లించేందుకు సహకార బ్యాంకుల్లో అనుమతించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. విత్తనాలు కొనుగోలుకు పాత రూ.500 నోట్లు వాడవచ్చని, పంటరుణాన్ని వారానికి రూ.25వేలు చొప్పున బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాని రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.