ఎన్నికల మూడ్లోకి బీజేపీ, అప్పుడే 2019 ఎన్నికల తొలి ర్యాలీ: ఫిబ్రవరి నాటికి 50చోట్ల మోడీ
Recommended Video
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సన్నద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికులు రూపొందించినట్లుగా తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా 400 లోకసభ స్థానాల్లో రెండు వందల ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
లోకసభ ఎన్నికలే లక్ష్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలోని వంద లోకసభ నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోడీ 50కి పైగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ నేతలు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు కూడా 50కి పైగా ర్యాలీల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
ఆ లోపే 400 లోకసభ స్థానాలు కవర్
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు ఈ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రతి ర్యాలీ రెండు నుంచి మూడు లోకసభ స్థానాల మీదుగా ఉంటుందని తెలుస్తోంది. లోకసభ ఎన్నికల తేదీ ప్రకటించడానికి ముందే ఈ ర్యాలీలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈసీ ప్రకటనకు ముందు 400కు పైగా లోకసభ స్థానాలను కవర్ చేయాలని చూస్తున్నారు.
50 ర్యాలీలలో ప్రధాని మోడీ
దేశవ్యాప్తంగా 400 లోకసభ స్థానాలను ప్రభావితం చేసేలా రెండు వందల వరకు ర్యాలీలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. 50 ర్యాలీలలో ప్రధాని మోడీ పాల్గొంటారని, అవి వందకు పైగా నియోజకవర్గాలను కవర్ చేస్తాయని, వాటితో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలలోను ప్రధానమంత్రి పాల్గొంటారని చెబుతున్నారు.
అదే తొలి అడుగు.. మొదటి ర్యాలీ
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం పంజాబ్లోని మాలోత్ కిసాన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలకు ఇది తొలి అడుగు అని చెబుతున్నారు. ఇలాంటి రైతుల ర్యాలీనే ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పురలో ఈ నెలాఖరులో నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లడం
పార్టీ కార్యకర్తలను ఎన్నికల మూడ్లోకి తీసుకు వచ్చేందుకే ఈ ర్యాలీలు అని చెబుతున్నారు. అదే విధంగా ఈ నాలుగేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. తద్వారా ఇతర పార్టీల దుష్ప్రచారాన్ని సాధ్యమైనంత మేర తిప్పికొట్టి, ప్రజలకు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుందని భావిస్తున్నారు.