నన్ రేప్ సంఘటనపై సీరియస్: నివేదిక కోరిన మోడీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నన్పై జరిగిన అత్యాచార ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్గా తీసుకున్నారు. ఈ సామూహిక అత్యాచార ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హర్యానాలో చర్చిపై జరిగిన దాడిపై కూడా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
మైనారిటీ కమ్యూనిటీలో ఆందోళనలకు దారి తీసిన ఈ రెండు సంఘటనలపై కూడా నివేదికలు సమర్పించాలని నరేంద్ర మోడీ ఆదేశించారు. హర్యానాలోని హిసార్, పశ్చిమ బెంగాల్లోని నాడియా ఘటనలపై ప్రధాని తీవ్రంగా చలించారని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ రెండు ఘటనలపై వెంటనే నివేదిక సమర్పించాలని ప్రధాని ఆదేశించినట్లు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లోని రాణా ఘాట్లోని ఓస్కూల్లో అర్ధరాత్రి ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె, మనసులోని బాధను పక్కనబెట్టి పెద్ద మనసుతో వారిని క్షమించాలని తెలిపారు. తన రక్షణకంటే, తన పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల భద్రతే తనకు ముఖ్యమని తెలిపారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత కూడా ఆమె నిర్మలమైన మనస్సుతో కనిపిస్తోందని, ఇది ఆమె మనో ధైర్యానికి నిదర్శమని ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు వెల్లడించారు. చికిత్స్ పొందుతున్న నన్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నన్పై అత్యాచారానికి సంబంధించిన కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్గా ఉంది. నన్పై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. నదియా జిల్లాలోని గంగ్ నాపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఓ స్కూలుపై కొందరు దుండగులు దాడి చేసి, 71ఏళ్ల నన్పై సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. నిందితులను వెంటనే పట్టుకునేందుకు నదియా జిల్లా ఎస్పీ సమాచారం అందించిన వారికి రూ. లక్ష నజరానా కూడా ప్రకటించారు.