పంజాబ్ పోరు.. రేపు మోడీ పర్యటన.. రెండేళ్ల తర్వాత, డెవలప్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పర్యటించగా.. బుధవారం ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రెండేళ్ల తర్వాత పంజాబ్లో కాలుమోపనున్నారు. పంజాబ్లోని సరిహద్దు జిల్లా అయిన ఫిరోజ్పూర్ లో పర్యటించనున్న మోడ.. రూ.42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఢిల్లీ-అమృత్సర్-కత్రా ఎక్స్ప్రెస్వే, ఫిరోజ్పూర్లో పీజీఐఎంఈఆర్ శాటిలైట్ సెంటర్ సహా రూ.42,750 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పంజాబ్ పర్యటనలో ఎన్నికల ర్యాలీల్లో కూడా మోడీ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మోడీ పర్యటనను కొన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పంటకు కనీస మద్దతు ధరకి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావాలని, రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కొన్ని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ఫిరోజ్పూర్ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి నాగేశ్వరరావు తెలిపారు. ఫిరోజ్పూర్ జిల్లాలో సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఫిరోజ్పూర్ జిల్లాలో యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ పోలీసులు, ఎన్ఎస్జి, ఆర్మీ మరియు బిఎస్ఎఫ్తో సమన్వయంతో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఇటు సంగ్రూర్ ఎంపీ కూడా అయిన భగవంత్ మాన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆప్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే పోరాడాలని సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు మంగళవారం ఉదయం కోవిడ్-19 పాజిటివ్ రావడమేనని తెలుస్తోంది. గత నెలలో భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర ఆరోపణ చేశారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరితే భారీగా డబ్బు, కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి ఇస్తామని ఓ సీనియర్ బీజేపీ నేత తనకు చెప్పారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇటువంటి ఆశలు పెట్టిన బీజేపీ నేత ఎవరో బహిరంగంగా చెప్పాలని భగవంత్ మాన్ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆప్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.