బిజెపి స్లోగన్: రామ మందిర్ ఇక అటకెక్కినట్లేనా?
అత్యంత వివాదాస్పదమైన రామ మందిర నిర్మాణం నినాదాన్ని బిజెపి దాదాపుగా వదిలేసినట్లే కనిపిస్తోంది. బిజెపి నాయకుల మాటల తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది.
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) రామ మందిర నిర్మాణం నినాదాన్ని పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. అత్యంత వివాదాస్పదమైన ఆ నినాదంపై బిజెపి ఎక్కువగా మాట్లాడడం లేదు.
ఎగ్జట్ పోల్స్ బిజెపికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు లభిస్తాయని అంచనా వేసినప్పటికీ ఇంత భారీ మెజారిటీ వస్తుందని ఊహించలేదు. ఇంత ఘన విజయం సాధిస్తామని బిజెపి నాయకులు కూడా అనుకోలేదు. ఈ స్థితిలో రామ మందిరం అంశాన్ని బిజెపి నాయకులు దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
యుపి విజయానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ, రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడడం లేదు.
విజయంపై రవిశంకర్ ప్రసాద్ ఇలా....
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువత అభివృద్ధిని ఆకాంక్షిస్తోందని, అదే ఫలితాల్లో ప్రతిఫలించిందని బిజెపి నాయకుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఓ టీవీ చానెల్స్తో మాట్లాడుతూ ఆయన ఆ విధంగా అన్నారు. రామ్ ప్రభంజనాన్ని తాము దాటేశామని, ఆ విధమైన ఆశను, నమ్మకాన్ని మోడీ ప్రజలకు కలిగించారని ఆయన అన్నారు. దీన్ని బట్టి బిజెపికి ఇక అంతగా రామ మందిరాన్ని ఎజెండాగా చేయాల్సిన అవసరం లేదని అర్థం చేసుకోవచ్చు.
విజయంపై ఉమా భారతి ఇలా...
రామ మందిరం పార్టీ ప్రధాన ఎజెండా కాదని కేంద్ర మంత్రి ఉమా భారతి, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెపి మౌర్య సూచనప్రాయంగా చెప్పారు. రామమందిరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉమా భారతి అన్నారు. మత, కుల ప్రాతిపదికపై ఓట్ల సమీకరణ ఇక ఎంత మాత్రం సాధ్యం కాదని ఉమా భారతి అన్నారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఆ పని చేయలేకపోయారని అన్నారు. రామ మందిర అంశం విభజించే అంశం కాదని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని మోడీ చూపిస్తారని చెప్పారు. హిందువులు, ముస్లింలు కలిసి సమస్యను పరిష్కరించుకుంటారని చెప్పారు.
సుప్రీం తీర్పు ప్రకారమే....
అయోధ్యలో రామ మందిర నిర్మాణం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రాతిపదికగానే జరుగుతుందని కెపి మౌర్య అన్నారు. అది కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. అందువల్ల దాని గురించి మాట్లాడడం సరి కాదని అన్నారు. అందువల్ల రామ మందిర నిర్మాణానికి తాము ఏ విధమైన చర్యలు కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము పేదలకు అనుకూలమైన విధానాలు, అభివృద్ధి ప్రాతిపదికలపై ఎన్నికల్లో పోటీ చేశామని, అవే తమను గెలిపించాయని చెప్పారు.
మానిఫెస్టోలోరాశాం, చదువుకోండి...
రామమందిర నిర్మాణం గురించి తాము తమ ఎన్నికల ప్రణాళికలో రాశామని, దాన్ని చదువుకోవాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ మిశ్రా అన్నారు. అయితే, మందిరాన్ని అక్కడే నిర్మిస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో రాసుకుంది. కేవలం మాట మాత్రంగానే దాన్ని ఎన్నికల ప్రణాళికలో రాశారు. దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.
ఆదిత్యనాథ్ ఇలా...
ప్రధాని విశేష కృషి, ఆయన చేపట్టిన కార్యక్రమాలే తమ పార్టీని యుపిలో గెలిపించాయని బిజెపి పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా అక్కడక్కకడ చాలా తక్కువగా రామ మందిర నిర్మాణం గురించి బిజెపి నాయకులు ప్రస్తావించారు. దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.