నేడు తెరచుకోనున్న శబరిమల ఆలయం: ఎక్కడికక్కడ మహిళల నిలిపివేత, ఉద్రిక్తత
Recommended Video
తిరువనంతపురం: సుప్రీంకోర్టు నేపథ్యంలో శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం.
ఈ క్రమంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లకుండా ఇన్నాళ్లూ నిషేధం ఉండగా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునివ్వడం తెలిసిందే. సుప్రీం తీర్పును నిరసిస్తూ త్రివేండ్రంలో ఓ మహిళ బహిరంగంగా ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా ఆమెను కాపాడారు.
ఆలయ భాగస్వామ్య పక్షాలతో మంగళవారం ట్రావెన్కోర్ దేవస్థాన మండలి భేటీ అయినప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడంతో కేరళలో నిరసనలను తగ్గించేందుకు తోడ్పడే పెద్ద నిర్ణయాలేవీ తీసుకోలేకపోయింది.
తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టును తాము కోరేది లేదని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పడం, అటు కేంద్రం నుంచి కూడా స్పందన లేకపోవడంతో నిరసనలు తాజాగా మరింత తీవ్రరూపం దాల్చాయి. బుధవారం ఆలయం తెరుచుకోనుండటంతో శబరిమలకు వెళ్లే దారంతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.