ఎస్బిఐ బాదుడు మొదలైంది: కనీస నిల్వలు లేకపోతే పెనాల్టీ తప్పదు..
మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్బిఐ నిర్ణయించిన మేరకు నేటి నుంచి చార్జీలు అమలుకానున్నాయి.
న్యూఢిల్లీ: ఇంతకుముందు ప్రకటించినట్లుగానే కనీస నిల్వలు లేని ఖాతాలపై ఎస్బిఐ ఛార్జీల మోత మోగించడానికి సిద్ధమైంది. ఈ మేరకు నేటి నుంచి చార్జీల బాదుడు మొదలుపెట్టనుంది. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్బిఐ నిర్ణయించిన మేరకు నేటి నుంచి చార్జీలు అమలుకానున్నాయి.
మరోవైపు స్టేట్ బ్యాంకులో మిగతా ఐదు బ్యాంకుల విలీనం కూడా నేడే జరగనుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంకు ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంకు ఆఫ్ జైపూర్ అండ్ బికనీర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, భారతీయ మహిళా బ్యాంకులు భారతీయ స్టేట్ బ్యాంకులో నేడు విలీనం కానున్నాయి.
ఈ బ్యాంకులన్ని ఎస్బిఐ కిందకే వస్తుండటంతో.. ఆయా ఖాతాదారులందరికీ చార్జీల బాదుడు తప్పదు. దీంతో మొత్తం మీద 31 కోట్ల మందిపై ఈ ప్రభావం పడనుంది.
చార్జీల వివరాలు:
మెట్రో నగరాల్లో గతంలో ఖాతాల్లోని కనీస నిల్వ రూ.1,000గా ఉండేది. దాన్ని నేటి నుంచి రూ.5,000 చేసింది. అర్బన్ ప్రాంతాల్లో దీన్ని రూ.3,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000కి పెంచేసింది. నెలవారీగా ఈ కనీస నిల్వలను ఉంచకపోతే ఆయా ఖాతాదారులపై ఒక నెలలో రూ.20 నుంచి రూ.100 వరకు జరిమానా విధించనున్నారు.
ఏటీఎం చార్జీల బాదుడు:
సొంత బ్యాంకు ఏటీఎంలలో మూడుసార్ల కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తే అదనపు చార్జీలు వసూలు చేస్తారు. వేరే బ్యాంకుల ఏటీఎంలలోను ట్రాన్సాక్షన్స్ పరిమితి మూడుసార్ల కన్నా మించరాదు. రూ.25వేల నిల్వ ఉండే ఖాతాలకు మాత్రం ట్రాన్సాక్షన్స్ పరిమితి వర్తించదని, వారిపై ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని ఎస్.బి.ఐ ప్రకటించింది.