షాకింగ్ .. దీర్ఘకాల కరోనా బాధితుల్లో 200 కు పైగా రోగ లక్షణాలు : అధ్యయనంలో వెల్లడి
కరోనా దీర్ఘకాల సమస్యతో బాధపడుతున్న వారిలో దాదాపు రెండు వందలకు పైగా లక్షణాలు ఉంటాయని ఇటీవల ఒక అధ్యయనం షాకింగ్ నివేదిక వెల్లడించింది. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్లో ఒక అధ్యయనం వెల్లడించిన విషయం తెలిసిందే . తాజాగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మరో అధ్యయనంలో దీర్ఘకాలిక కరోనాతో బాధ పడిన వారిలో దాదాపు రెండు వందల లక్షణాలకు పైగా ఉంటాయని గుర్తించారు.

లాంగ్ కోవిడ్ బాధితుల్లో వందల్లో అనారోగ్య సమస్యలు
లాంగ్ కోవిడ్ బాధితుల్లో బ్రెయిన్ ఫాగ్ నుంచి మొదలుకొని టిన్నిటస్ అంటే చెవిలో పోటు వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, కొందరిలో మనోవైకల్యం కలుగుతుందని, మరికొందరిలో వణుకు వంటి లక్షణాలు కూడా కనిపించాయని నివేదించారు . జ్ఞాపకశక్తి సమస్యలు, మానసిక అశాంతి, నీరసం, దురద , నెలసరి హెచ్చుతగ్గులు, లైంగిక బలహీనత, గుండెదడ, ఆయాసం వంటి అనేక లక్షణాలు కోవిడ్ బాధితుల్లో కనిపించాయని అధ్యయనం వెల్లడించింది.

56 దేశాల నుండి లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్న 3672 మందిపై అధ్యయనం
ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక లాన్సెట్ లో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం ఈ అధ్యయనం యాభై ఆరు దేశాల నుంచి లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్న 3672 మందిపై జరిగింది. ఇక వీరిలో 203 లక్షణాలను గుర్తించారు.203 లక్షణాలలో అరవై ఆరు లక్షణాలు ఏడునెలల వరకు కొనసాగాయి అని తేలింది. లాంగ్ కోవిడ్ బాధితులలో చాలామందిలో కనిపించిన ప్రధాన సమస్యలు నీరసం, జ్ఞాపక శక్తిని కోల్పోవడం, డయేరియా, కళ్ళు మసకబారడం, దద్దుర్లు, గుండె దడ, మూత్రాశయం పై నియంత్రణ కోల్పోవడం ప్రధానంగా కనిపించాయి.

లాంగ్ కోవిడ్ 10 అవయవ వ్యవస్థలపై ప్రభావం
2454 మంది రోగులు ఏడు నెలల వరకు 14 శాతం లక్షణాలను కలిగి ఉన్నారు. కొంతమందిలో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. దీర్ఘకాలిక కోవిడ్ రోగులు 10 అవయవ వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఇక అంతే కాదు కరోనా మహమ్మారి సోకినవారిలో న్యూరో సైకియాట్రిక్, న్యూరోలాజికల్ లక్షణాలతో పాటుగా అసహనం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ సర్వేలో పాల్గొన్న 22 శాతం మంది రోగులు కోవిడ్ తర్వాత తమకు పని చేసేందుకు శక్తి లేదని ఉద్యోగాలను పోగొట్టుకున్నామని, దీర్ఘకాలిక సెలవులు పెట్టామని పేర్కొన్నట్లుగా సమాచారం .

లాంగ్ కోవిడ్ దెబ్బకు పని చెయ్యలేకపోతున్నాం అన్న బాధితులు
మరో 45 శాతం మంది తమకు అంతకు ముందులా పనిచేసేందుకు సాధ్యం కావడం లేదని చెప్పినట్లుగా అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ కాలేజ్ లండన్లోని న్యూరో సైంటిస్ట్ అథ్నా అక్రమి మాట్లాడుతూ చాలామంది కోవిడ్ తర్వాత శ్వాసకోశ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారని అయితే దీంతో పాటు అనేక ఇతర సమస్యలు కూడా వస్తున్నాయని, వైద్యులు సంపూర్ణ దృష్టితో రోగులను పరిశీలించాలని పేర్కొన్నారు కరోనా బారిన పడి 16 నెలలు అయినా కూడా రోగ లక్షణాలతో బాధపడుతున్న వారు ఇంకా ఉన్నారని చెప్పారు. ఏదిఏమైనా కరోనా మహమ్మారి వచ్చిన ప్రతి ఆరుగురిలో ఒకరు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గా అధ్యయనం తేల్చింది.












Click it and Unblock the Notifications