చెన్నై: సునామీ, భూకంపం వదంతులు, జనం భయం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. శనివారం నుంచి కుదుటపడుతోంది. వరద నీరు తగ్గుతోంది. ఈ రోజు నుంచి చెన్నై విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం అవుతున్నాయి. రవాణా, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు.
సాధారణ స్థితికి చేరుకునే క్రమంలో తలమునకలైన చెన్నై నగరవాసులపై వరుణుడు మరోమారు ఆదివారం తన ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం నుంచి చెన్నై నగర వ్యాప్తంగా వర్షం పడుతోంది. తాంబరం, మెడిచ్చూర్, మీనంబాక్కం, రామాపురం, కొట్టివాక్కం, ఆడంబాక్కం తదితర ప్రాంతాల్లో ఐదు అడుగుల మేర నీరు నిలిచి ఉంది.
వరదలు, వర్షాలు, ఇండ్లు కూలిపోవడం తదితర కారణాల వల్ల మరణించిన వారి సంఖ్య 450కు పెరిగినట్లుగా తెలుస్తోంది. బయటి నుంచి అందుతున్న సాయం ఏ మాత్రం సరిపోవడం లేదు. జయలలిత సర్కారు సైతం తమను ఆదుకోవడంలో విఫలమవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుండటంతో.... వరదలతో ఇళ్లల్లోకి నీరు చేరడంతో పాడైపోయన వస్తువులను, వంట సామగ్రిని ఆరు బయట వేసుకుని శుభ్రం చేసుకుంటున్నారు. ఇంట్లోని పప్పులను, ఇతర వస్తువులను ఎండలో ఆరబెట్టుకుంటున్నారు.
శనివారం అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టి రోడ్లు వాహనాలు తిరగడానికి అనుకూలంగా మారడంతోపాటు రైలు సర్వీసులు, టెలీ కమ్యూనికేషన్ సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరణ కావడంతో నగర ప్రజలు మళ్లీ బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లయింది.
చాలాప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ కొట్టుపురంతోపాటు కొన్ని శివారు ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. దీంతో భవనాలపైన, పై అంతస్థుల్లో తలదాచుకున్న ప్రజలు పాలు, నీళ్లు లాంటి అత్యవసర సాయంకోసం ఇంకా ఎదురు చూస్తున్నారు.
ఆదివారం కల్లా నగరంలో పాల సరఫరా పూర్తిగా పునరుద్ధరిస్తామని ప్రభుత్వ డెయిరీ ఆవిన్ ప్రకటించింది. శనివారం 10.20 లక్షల లీటర్ల పాల పాకెట్లను సరఫరా చేసినట్లు తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున పాలపొడిని సరఫరా చేసినట్లు కూడా సంస్థ తెలిపింది.
కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువుల కొరత మాత్రం ఇంకా ఎక్కువే ఉంది. చాలా పెట్రోలు బంకులు, ఎటిఎంలు పని చేయక పోగా, పని చేస్తున్న కొద్దిపాటి పెట్రోలు బంకులు, ఎటిఎంల వద్ద మైళ్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. చాలామంది ఇళ్లల్లోకి నీరు చేరడంతో ఫ్లై ఓవర్ల కింద గడుపుతున్నారు.
మరోవైపు శనివారం రాత్రి చెంబరంబాక్కం రిజర్వాయర్కు గండిపడిందన్న పుకార్లు రావడంతో జనం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సహాయక చర్యలు ప్రధానంగా తివిధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అయితే స్థానిక అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
సునామీ.. భూకంపం వదంతులు
బంగాళాఖాతంలో భారీస్థాయిలో భూకంపం సంభవించిందని, ఇక కొన్ని గంటల్లో చెన్నైని ముంచెత్తే స్థాయిలో సునామీ వచ్చే అవకాశముందని చెన్నైలో భారీగా వదంతులు వచ్చాయి. శనివారం ఉదయం రిక్టర్ స్కేలు పైన 7.1గా నమోదైందని వాట్సాప్, ఫేస్బుక్లలో ప్రచారం జరిగింది. దీంతో చెన్నైవాసులు బెంబేలెత్తారు. కొందరైతే చెన్నైని వదిలిపెట్టి వెళ్లారు. భూకంపం వదంతులు నమ్మవద్దని, భయం లేదని అదికారులు చెప్పారు.