ట్విస్ట్లు: సునంద, థరూర్ ఎప్పుడు గొడవపడేవారు: తెరపైకి సునీల్
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్కు ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో సిట్ పోలీసులు సునంద ఇంటి పని మనిషి నారాయణ విచారించిన విషయం తెలిసిందే. ఇందులో ఆ పని మనిషి పలు కొత్త విషయాలు వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విచారణలో భాగంగా మొదటగా సునంద ఇంటి పని మనిషి నారాయణను పోలీసులు ప్రశ్నించారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. శశిథరూర్ ప్రవర్తనపై అతని భార్య సునంద అసంతృప్తిగా ఉండేదని, ఇద్దరూ తరచుగా గొడవ పడేవారని పని మనిషి నారాయణ పోలీసులకు చెప్పాడు.
మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... సునంద మృతికి కొద్దిసేపటికి ముందు కూడా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, సునంద చనిపోవడానికి ముందు సునీల్ సాహెబ్ అనే వ్యక్తిని కలిశారన్నాడు. శశిథరూర్ విషయాలను బయటపెట్టేందుకు సునంద ప్రయత్నించారని, ఆ సమయంలోనే ఆమె చనిపోయారని నారాయణ పోలీసులకు చెప్పాడు.
తాను శశిథరూర్, సునందల వద్ద అక్టోబర్ 22, 2010 నుండి పని చేస్తున్నానని, సునంద పుష్కర్ మేడమ్, శశిథరూర్కు అన్నం వండి పెట్టడం, బట్టలు ఇస్త్రీ చేయడం వంటివి తన పని అని చెప్పాడు. సునంద మృతికి ఏడాది ముందు వారిద్దరి మధ్య గొడవలు జరిగేవని చెప్పినట్లుగా తెలుస్తోంది.
దుబాయ్లో పెద్ద గొడవ
గత ఏడాది డిసెంబర్ నెలలో తాను, సునంద, థరూర్లం దుబాయ్ వెళ్లామని, అక్కడ మొదటిసారి వారి మధ్య పెద్ద గొడవ జరగడం చూశానని, కానీ ఎందుకు ఆ గొడవ జరిగిందో తనకు తెలియదని చెప్పాడు.
ఆరోగ్యం బాగా లేనప్పుడూ...
ఆ సమయంలో శశిథరూర్ను సునంద పుష్కర్ నెట్టి వేసిందని, అతని కాలికి గాయమైందని, థరూర్ను ఉద్దేశించి సునంద ఆగ్రహంతో కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పాడు. తన ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా నువ్వు నా పట్ల కేర్ తీసుకోలేదని, ఫోన్కే అంటుకు పోయావని ఆరోపించారని చెప్పాడు.
జనవరి 15న నాటి విషయంపై నారాయణ్ చెబుతూ... సునంద మేడమ్ రూం నెంబర్ 307లోకి వెళ్లారని, ఆమెతో పాటు సునీల్ సాహెబ్ వెళ్లారని, ఫోన్లో ట్వీట్ చేశారని చెప్పాడు. సునీల్ సాహిబ్ జనవరి 16న వచ్చాడని, టీవీ స్విచ్ ఆన్ చేయమని చెప్పాడని, ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగా లేక ఇంటికి వెళ్లానని నారాయణ చెప్పాడని తెలుస్తోంది.
ఆ తర్వాత తాను వచ్చినప్పుడు వారు రూం నెంబర్ 345కు షిప్ట్ అయ్యారని, సునంద ఫోన్ తీయడంలేదని చెప్పాడు. ఆ తర్వాత సునంద.. థరూర్కు ఫోన్ చేయమని చెప్పిందని, ఆయన లిఫ్ట్ చేయకపోయేసరికి, మరో పని మనిషిని పంపించాలని చెప్పిందని చెప్పాడు.
రాత్రంతా గొడవ..
తాను జైపూర్ ట్రిప్కు వెళ్తున్నానని, త్వరగా తిరిగి వస్తానని థరూర్ చెప్పాడని, అతను అర్ధరాత్రి 12.30కు తిరిగి వచ్చారని, ఆ రాత్రి నాలుగున్నర గంటల వరకు థరూర్, సునందల మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. వేకువజామున నాలుగున్నర ఐదు గంటల మధ్య సునంద ఎవరతోనో ఫోన్లో మాట్లాడారని చెప్పాడు. జనవరి 17 ఉదయం ఆరున్నర గంటల వరకు వారి మధ్య వాగ్వాదం జరిగిందన్నాడు. అనంతరం థరూర్ గదికి వెళ్లాడన్నాడు.
ఆ రోజు జనవరి 17న సాయంత్రం నాలుగున్నర గంటలకు థరూర్ తనను పిలిచి సునంద ఆరోగ్యం గురించి అడిగారని, అయితే, ఆరోగ్యం బాగా లేదని తాను చెప్పానని, ఆమె సరిగా తనడం లేదని చెప్పానని పోలీసులతో చెప్పాడు. సునందను లేపమని అడిగాడని చెప్పాడు.
తాను లేపగా, ఆమె నుండి ఎలాంటి స్పందన రాలేదని, థరూర్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి వైద్యుడిని పిలవమని చెప్పారని, ఆమె చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారని, దీంతో థరూర్ పీఏ పోలీసులకు సమాచారం అందించాడని, అరగంట అనంతరం పోలీసులు వచ్చారని చెప్పాడు.
తెరపైకి సునీల్ సాహెబ్
పని మనిషి నారాయణ పలు కొత్త విషయాలు వెల్లడించగా.. తెరపైకి సునీల్ సాహిబ్ పేరు వచ్చింది. సునంద చనిపోవడానికి ముందు సునీల్ అనే వ్యక్తి కలిసినట్లుగా చెబుతున్నారు. హోటల్ లీలా ప్యాలెస్లో సునంద గదిలో సునీల్ సాహిబ్ ఉన్నట్లు నారాయణ.. సిట్ విచారణలో వెల్లడించారని తెలుస్తోంది. సునీల్ సాహిబ్ ఎవరు, ఎక్కడ ఉంటారనే దాని పైన అతను సమాధానం చెప్పలేకపోయాడని తెలుస్తోంది.
దీంతో సునీల్ను విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు. సునంద ట్విట్టర్ అకౌంటుతో పాటు ఆమె ఆన్ లైన్ వ్యాపారాలు అతను చూసేవాడని తెలుస్తోంది. మరోవైపు, విచారణలో భాగంగా సునందను ఆమె మరణానికి 48 గంటల ముందు ఎవరెవరు కలిశారు.. తదితర అంశాలు సేకరిస్తున్నారు.