బెంగళూరులో అనుమానిత ఉగ్రవాది: జిలెటిన్ స్టీక్స్ సీజ్, భార్య, సోదరి, బావ మాయం!
బెంగళూరు: స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పసిగట్టిన ఎన్ఐఏ అధికారులు అప్రమత్తం అయ్యారు. బెంగళూరు గ్రామీణ జిల్లాకు సమీపంలోని రామనగరలో అనుమానిత ఉగ్రవాది మునీర్ ను అరెస్టు చేశారు.
అనుమానిత ఉగ్రవాది మునీర్ అనే యువకుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ, ఐబీ అధికారులు అతన్ని బెంగళూరు నగరంలోని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. మునీర్ ఇంటిలో ల్యాప్ టాప్, జిలెటిన్ స్టిక్స్, పేలుడు పదార్థాల పౌడర్, పర్యాటక కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, మసీదుల ఫోటోలు, మ్యాప్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ఐఏ అధికారుల విచారణలో మునీర్ తాను మరో ల్యాప్ టాప్ ఉపయోగిస్తున్నానని, అది తన భార్య దగ్గర ఉందని బాంబు పేల్చాడు. ఎన్ఐఏ అధికారులు మళ్లీ రామనగరకు పరుగు తీశారు. అయితే మునీర్ భార్య శజిద్ బీబీ, ఆమె అన్న, వదిన, మునీర్ పిల్లలు అప్పటికే మాయం అయ్యారు.
మునీర్ ఇంటిని పూర్తిగా పరిశీలించినా అధికారులకు ఎలాంటి ల్యాప్ టాప్ చిక్కలేదని సమాచారం. మునీర్ భార్య శజిద్ బీబీ ల్యాప్ టాప్ తీసుకుని పారిపోయి ఉంటుందని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రామనగర మొత్తం గాలించినా మునీర్ కుటుంబ సభ్యులు ఎక్కడా కనపడలేదు.
మునీర్ ను అరెస్టు చేసిన సమయంలో ఇంటిలో అతని భార్య శజిద్ బీబీ, ఆమె పిల్లలు ఉన్నారు. మునీర్ ను అరెస్టు చేసిన తరువాత వారు మాయం కావడంతో ఎన్ఐఏ అధికారులు, కర్ణాటక పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, రామనగర జిల్లాల్లో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.