సిడ్నీ కేఫ్ సీజ్: మరో బందీ కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగే
సిడ్నీ: సిడ్నీ కేఫ్లో ఉగ్రవాది బందీగా చిక్కిన మరో భారతీయుడు కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగేనని తెలుస్తోంది. లిండ్ కేఫ్లో హరోన్ మోనిస్ 17 మందిని నిర్బంధించాడు. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి విశ్వకాంత్ రెడ్డితో పాటు మరో భారతీయుడు పుష్పేందు ఘోష్ కూడా ఉన్నారు. పశ్చమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పుష్పేందు ఘోష్ కూడా ఇన్ఫోసిస్లోనే పనిచేస్తున్నాడు.
విశ్వకాంత్ అంకిరెడ్డి బందీగా ఉన్న విషయాన్ని ఇన్ఫోసిస్ సోమవారంనాడే ధ్రువీకరించింది. కేఫ్లో తమ కంపెనీకి చెందిన మరో ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం అందిందని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరువురు కూడా క్షేమంగా బయటపడ్డారని తెలిపింది. తమ ఉద్యోగులను క్షేమంగా బయటకు తెచ్చిన ఆస్టేలియా పోలీసులకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
పోలీసులు విశ్వకాంత్ అంకిరెడ్డికి వైద్య చికిత్స అందించారు. విశ్వకాంత్ రెడ్డి పోలీసులు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. విశ్వకాంత్ రెడ్డి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారని ఆయన భార్య శిల్పా రెడ్డి చెప్పారు. గంటకో సారి పోలీసులు తనకు ఫోన్ చేసినట్లు చెప్పారు.
బందీగా చిక్కిన తర్వాత తన భర్త తనకు ఫోన్ చేశాడని, సాయుధుడు తమకేమీ అపాయం తలపెట్టడం లేదని చెప్పాడని ఆమె చెప్పారు. భారత ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా పోలీసులకు ఆమె కృతజ్ఝతలు చెప్పారు. 16 గంటల తర్వాత బందీలు మోనిస్ చెర నుంచి విడుదలయ్యారు. పుష్పేందు ఘోష్ క్షేమంగా విడుదలైనట్లు ఆపరేషన్ ముగిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.