తగ్గిన జయలలిత ఆస్తులు: అయినా రూ.113 కోట్లు
చెన్నై: గతంతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు తగ్గాయి. నిరుడు జూన్లో ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ రూ.113 కోట్లు ఉంటుంది. రుణాలు మాత్రం రూ.2.04 కోట్లు మాత్రమే ఉన్నాయి.
ఆమె చరాస్తుల విలువ రూ.41.63 కోట్లు ఉంటుంది. ఆమెకు రూ.10.63 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నారు. కంపెనీల్లో రూ.27.44 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఆమెకు అంబాసిడర్ (రూ.80 వేలు), మహీంద్ర జీపు (రూ.10 వేలు) మహీంద్రా బొలెరో (రూ.80 వేలు), టెంపో ట్రావెలర్ (రూ.80 వేలు), స్వరాజ్ మాజ్దా మాక్సీ (రూ.10 వేలు), కాంటెస్సా (రూ. 5వేలు), టెంపో ట్రాక్స్ (రూ.30 వేలు)), రెండు టయోటాలు (ఒక్కోదాని ఖరీదు రూ.20 లక్షలు) ఉన్నాయి.
జయలలిత స్థిరాస్తుల విలువ రూ. 72,09 కోట్లు ఉంటాయి. హైదరాబాదులో వ్యవసాయ భూమి, పోయెస్ గార్డెన్, టైనాంపేట్, మండవేలిల్లో వాణిజ్య భవనాలు ఉన్నాయి. ఆదాం పన్ను బకాయిలు గానీ సంపద పన్ను, సర్వీసు టాక్స్ లేదా ఆస్తి పన్ను బకాయిలు గానీ లేవు.
పోయెస్ గార్డెన్లో వేద నిలయం విలువ రూ.43.96 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జయలలిత, ఆమె తల్లి కలిసి దాన్ని రూ.1.32 లక్షలకు 1967 జులైలో కొనుగోలు చేశారు. 21,280.300 గ్రాముల బంగారం కచ్చితమైన విలువను కట్టలేకపోయామని, అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడంతో అలా జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆ బంగారం కర్ణాటక ప్రభుత్వ కోశాగారంలో ఉంది.
తనకు 1,250 గ్రాముల వెండ నగలు ఉన్నాయని, వాటి విలువ రూ.3.12 లక్షలు ఉంటుందని జయలలిత తన అఫిడవిట్లో చెప్పారు. 2011 మేలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఆమె ఆస్తుల విలువ రూ.51.40 కోట్లు ఉంది.