ఆదర్శ ఉపాధ్యాయుడు: స్కూలు కోసం డ్రైవర్గా మారిన టీచర్
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వర : గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ: అంటూ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చి దైవత్వాన్ని ఆపాదించిన సంస్కృతి మనది...! "మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ" అంటూ తల్లిదండ్రుల తరువాతి స్ధానం గురువుకే ఇచ్చిన దేశం మనది...నేటి బాలలను రేపటి తరం భ విష్యత్తు నిర్దేశకులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. కర్నాటకలో కూడా రాజారాం అనే ఉపాధ్యాయుడున్నాడు. పిల్లలకు రాజారాం అంటే ఎంతో ఇష్టం. రాజారాం కూడా పిల్లలపై అమితమైన ప్రేమను కనబుస్తాడు. ఇంతకీ రాజారాం గురించి అంత ప్రత్యేకత ఏమిటో చూద్దాం...
కర్నాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన రాజారాం బ్రహ్మవర్ పట్టణంలోని బరాలి ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నారు. అయితే ఆయన పని చేసే స్కూలుకు సరైన రవాణా వసతి లేదు. దీంతో ప్రతిసంవత్సరం అక్కడ స్కూళ్లో పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది. ఇది గమనించిన రాజారాం పిల్లలను ఎలాగైనా స్కూలుకు తిరిగి రప్పించాలని భావించాడు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడగా... వారు స్కూలుకు పిల్లలను పంపేందుకు బస్సు కానీ, వ్యాను కానీ లేదని అందుకే పిల్లలను స్కూలు మారుస్తున్నట్లు తెలిపారు. ఇది రాజారాంను కొంత ఆవేదనకు గురిచేసింది. అయితే వెంటనే ఓ మినీ బస్సును రాజారాం కొన్నాడు. ఇక సమస్యకు చెక్ పెట్టదలుచుకున్నాడు.
రాజారామే ప్రతిరోజు చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి స్కూలు పిల్లలను ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తాడు. అదికూడా పూర్తిగా ఉచితంగానే. ఇందుకోసం ఎలాంటి ఫీజు వసూలు చేయరు. ఇలా రోజుకు నాలుగు ట్రిప్పులు తిరిగి 30 కిలోమీటర్ల పరిసరాల్లో ఉన్న గ్రామాలు తిరిగి అక్కడి పిల్లలను తన స్కూలుకు తీసుకొస్తారు. స్కూలు అయిపోయాకా తిరిగి పిల్లలను తమ గ్రామాల్లో అదే బస్సులో వదిలేస్తూ ఉంటాడు. రాజారాం చదువు చెప్పడమే కాకుండా ఇలా పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో స్కూలు బస్సు నడిపే డ్రైవర్లపై నమ్మకం కోల్పోతున్న నేపథ్యంలో స్వయంగా ఓ టీచరే ఈ బాధ్యతను తీసుకోవడం చాలా గొప్ప విషయమని రాజారాంను కొనియాడారు.
బస్సు కొనేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేకపోవడంతో... రాజారాం స్నేహితులు తలోచేయి వేశారు. వారు అందించిన ఆర్థిక సహకారంతో రాజారాం స్కూలు బస్సు కొన్నట్లు తెలిపాడు. అయితే బస్సును మెయింటెయిన్ చేయడానికి కాస్త డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ అది కూడా స్నేహితులు కలిసి పంచుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు రాజారాం. ఒకప్పుడు 60 మంది విద్యార్థులున్న ఈ స్కూలులో 90 మంది విద్యార్థులు అయ్యారని చాలా గొప్పగా చెప్తారు రాజారాం. మొత్తం 90 మంది విద్యార్థులను స్కూలుకు సమయానికి చేర్చే బాధ్యతను తానే తీసుకున్నట్లు గర్వంగా కూడా చెబుతారు రాజారాం.
మొత్తానికి రాజారాం చేస్తున్న మంచి పనికి చాలామంది ప్రశంసిస్తున్నారు. కేవలం చదువు చెప్పడమే తన బాధ్యతగా భావించకుండా...ఇలా సేవలు చేయడం రాజారాం ఎంతో పుణ్యం కట్టుకున్నాడని పలువురు మేధావులు కొనియాడారు. ఇలాంటి టీచర్ స్కూలుకు ఒక్కరుంటే చాలు... పిల్లలు చదువుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తారని అభిప్రాయపడ్డారు. రాజారాం ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారని పొగడ్తల వర్షం మేధావులు కురిపించారు.