ఆదుకోండి: చిన్నారుల లేఖకు స్పందించిన పీఎంఓ
కాన్పూరు: ఓ ఇద్దరు చిన్నారుల ఆవేదనను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) అర్థం చేసుకుంది. తమ తండ్రిని అస్తమా వేధిస్తోందని, కుటుంబమంతా తీవ్రమైన కష్టాల్లో ఉందని, తమను ఆదుకోవాలని ఇద్దరుచిన్నారు కోరడంతో పీఎంఓ స్పందించింది.
ఉత్తర ప్రదేశ్లోని కాన్పూరు జిల్లా నౌబస్త ప్రాంతానికి చెందిన సుశాంత్ మిశ్రా (13), తన్మయ్ మిశ్రా (8) తమ కష్టాలను వివరిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీఎంఓ ఆ పిల్లల తండ్రి సరోజ్ మిశ్రాకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేయించాలని జిల్లా మేజిస్ట్రేటును, వైద్యాధికారిని ఆదేశించింది.
సరోజ్ మిశ్రా టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పీఎంఓకు ఆయన కుమారులు సుశాంత్, తన్మయ్ రాసిన లేఖలో తమ తండ్రికి రెండేళ్ళ నుంచి అస్తమా ఎక్కువగా ఉంటోందని, ఆరు నెలల నుంచి బట్టలు కుట్టడానికి కూడా అవకాశం లేకపోవడంతో ఆదాయం లేదని తెలిపారు.
కొన్ని నెలల నుంచి తమ ఇంటికి అద్దె కూడా చెల్లించడం లేదని వారు తమ ఆవేదనను పీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. ఫీజులు చెల్లించేందుకు డబ్బులు లేనందువల్ల తాము పాఠశాలకు కూడా వెళ్ళడం లేదని రాశారు. తెలిసిన వారి దగ్గర పీఎంఓ అడ్రస్ తీసుకుని తమ సమస్యలను లేఖ ద్వారా తెలియజేశామని చిన్నారులు తెలిపారు. స్పందించిన పీఎంఓ వారి తండ్రికి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించాలని జిల్లా మేజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ను ఆదేశించింది. దీంతో అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.