శశికళకు షాక్, ముగ్గురు రెబల్ ఎంపీలు జంప్, పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో భేటీ, మద్దతు !
తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ రంగుమారుతోంది. ఇంతకాలం తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం మీద విమర్శలు చేస్తూ చిన్నమ్మ శశికళ, టీటీవీ దినకరన్ భజన చేసిన ముగ్గురు ఎంపీలు .
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ రంగుమారుతోంది. ఇంతకాలం తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం మీద విమర్శలు చేస్తూ చిన్నమ్మ శశికళ, టీటీవీ దినకరన్ భజన చేసిన ముగ్గురు ఎంపీలు ఇప్పుడు వారిద్దరికీ ఝలక్ ఇచ్చారు.
శశికళ, టీటీవీ దినకరన్ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వానికి జైకోట్టారు. అన్నాడీఎంకే పార్టీ రాజ్యసభ సభ్యులు నవనీతక్రిష్ణన్, విజిల సత్యానంద్, ఎన్. గోకుల క్రిష్ణన్ (పుదుచ్చేరి) పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు.
అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం చేతికి వెళ్లిన తరువాత తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంత కాలం శశికళ, టీటీవీ దినకరన్ వెంట ఉన్న వారు ఒక్కొక్కరే చిన్నగా జారుకుంటున్నారు.
ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులు నవనీతక్రిష్ణన్, విజిల సత్యానంద్, ఎన్, గోకుల క్రిష్ణన్ మీడియాతో మాట్లాడుతూ గ్రూపు రాజకీయాలకు స్వస్థి చెప్పి తాము పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించామని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి తాము రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయ్యామని గుర్తు చేశారు.
నిజమైన అన్నాడీఎంకే పార్టీ తమిళనాడు ప్రభుత్వానిదే అని భారత ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించిన సందర్బంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంను కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటించామని రాజ్యసభ సభ్యులు చెప్పారు. ముగ్గురు ఎంపీలు జంప్ కావడంతో టీటీవీ దినకరన్, శశికళ వర్గీయులు మౌనంగా ఉన్నారు. మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జారిపోకుండా చూడటానికి మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు చేస్తున్నది.